తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రతిష్టాత్మకమైన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మే 11 నుండి 17 వరకు ‘విద్యా వారోత్సవాల’ను నిర్వహిస్తోంది. ప్రభుత్వ విద్యారంగంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ ఈ వారోత్సవాలకు నేడు అధికారికంగా అంకురార్పణ జరగనుంది. విద్యారంగంలో సమూల మార్పులు.. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
ఈ బృహత్తర కార్యక్రమానికి మే 11 సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి వారోత్సవాలను ప్రారంభించడంతో పాటు పాఠశాలల్లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సి.యు.ఆర్.ఇ (CURE) ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది.
స్టేడియం ప్రాంగణంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాళ్లను ముఖ్యమంత్రి.. మంత్రులు.. ఉన్నతాధికారులు సందర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభ.. నూతన విద్యా ఆవిష్కరణలను ఈ స్టాళ్ల ద్వారా ప్రదర్శించనున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమం వైభవంగా ప్రారంభం కానుంది. అనంతరం పాఠశాల బ్యాండ్లు.. ఎన్సీసీ.. స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాల కవాతు ఆకట్టుకోనుంది.
విద్యాశాఖ కార్యదర్శి.. ఉప ముఖ్యమంత్రి.. మంత్రులు ప్రభుత్వ విద్యా సంస్కరణల గురించి సభలో ప్రసంగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై సీఎం రేవంత్ రెడ్డి తన దిశానిర్దేశాన్ని వెల్లడించనున్నారు. ఈ వేదికపైనే ప్రతిభావంతులకు అవార్డుల ప్రదానం జరగనుంది. ముఖ్యంగా ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించిన కేజీబీవీ యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులకు సీఎం చేతుల మీదుగా ల్యాప్టాప్లు అందజేయనున్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానివ్వనున్నాయి.
Read Also: బండి సంజయ్ కుమారున్ని అరెస్ట్ చేయాలని మహిళా నేతలు డిమాండ్.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా!