Dialysis Centers: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. అందోలులో రూ.70 కోట్లతో ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు శనివారం జోగిపేటలోని శ్రీ రామ గార్డెన్లో నిర్వహించిన ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ అధ్యక్షత వహించారు. మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రతి 35 కిలో మీటర్ కు ఒక్కటి చొప్పున ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకే ప్రాధాన్యత నిస్తుందన్నారు. ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు, ఆరోగ్యభద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.25వేల కోట్లు, జిల్లాలో రూ.214 కోట్లు రుణమాఫీ జరిగిందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సబ్సిడీపై గ్యాస్, రైతు భరోసా, రైతు భీమా, ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షలకు పెంపు వంటి పథకాలను అమలుచేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేసినట్లు తెలిపారు.
అందోలులో తాను విద్య, వైద్య పరంగా హబ్లుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నర్సింగ్ కళాశాల, జేఎన్టీయు, పాలిటెక్నిక్ కళాశాలల, 150 పడకల ఆసుపత్రిని తీసుకువచ్చినట్లు తెలిపారు. తాను చేపడుతున్న అభివృద్ది 15 ఏళ్ల తర్వాత ఫలితాలు కనిపిస్తాయన్నారు. గత ప్రభుత్వాలు సింగూరు ప్రాజెక్టు కాలువ గూర్చి పట్టించుకోలేదని, తాను రూ.200 కోట్లతో కాలువల లైనింగ్ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. సింగూరు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నానని, ప్రతి రోజు కనీసపం 4,5 వేల మంది పర్యాటకులు పర్యటించేలా, దీంతో 100 కుటుంబాలు బ్రతికేలా ప్రణాళికను సిద్దం చేసినట్లు తెలిపారు.
Also read: ఎన్టీఆర్ తో ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్.. నీళ్ మావా నీ బుర్రే బుర్ర?
అందోలులో నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రిలో ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి దామోదర్ తెలిపారు. అందోలుకు ఇరువైపులా 30 కి.మీ లోపు రోడ్డు ప్రమాదాలు జరిగితే అంబులెన్స్లో ట్రామాకేర్ సెంటర్కు తీసుకువచ్చినట్లయితే నిమిషాల్లో చికిత్సలను అందజేస్తారని, 24 గంటలు ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. పెద్దారెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధుల మంజూరికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఓటమి, గెలుపులు సహజమేనని, నాయకులు ఆదర్శవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక జైన్, ఎస్పి పరితోష్ పంకజ్, డిప్యూటీ కలెక్టర్ పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల చిట్టిబాబు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం. జగన్మోహన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, డిఎంహెచ్వో వసంత్ రావు, హౌసింగ్ డీఈ అంకుష్, టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగమేశ్వర్, తహసిల్దార్ మధుకర్ రెడ్డి, ఎంపీడీవో రాజేష్, ట్రాన్సో్క డి ఈ శ్రీనివాసులు, కమిషనర్ రవీందర్, సిడిపిఓ ప్రియాంక, ఏడిఏ రమాదేవి, ఎంపీ ఓ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Also read: మరో సంచలన రికార్డును సొంతం చేసుకున్న తెలంగాణ సర్కార్..?