BJP Criticism: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు అమలు విషయంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు తీవ్రంగా విమర్శించారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేటలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు భారీగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం బాధ్యత వహించాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
గత ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేసిందని, అదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇప్పుడు అయినా స్పష్టమైన నిర్ణయం తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర నష్టపోయారని పేర్కొన్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకంలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాలని, ఆ పథకం అమల్లో ఉంటే రైతులకు గణనీయమైన ఉపశమనం లభించేదని తెలిపారు.
Also read: రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి- జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించిన ఆయన, నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం అందించాలని, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహిళా సంక్షేమానికి సంబంధించిన బిల్లుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరైన విధానం పాటించడం లేదని రామచంద్రరావు మండిపడ్డారు. మహిళల అభ్యున్నతికి కీలకమైన నిర్ణయాలను తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Also read: ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేలుడులో నలుగురు జవాన్ల మృతి