Telangana Cabinet meeting: తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అంశంపై రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రాజెక్టు బ్యారేజీల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులకు ఊరట లభించింది. ఈ కమిషన్ విచారణ ప్రక్రియలో ప్రాథమిక నిబంధనలను పాటించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు వెలువరించిన తీర్పుపై చర్చించేందుకు రేపు (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం 2024 మార్చి 14న ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 6ను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్రావుతో పాటు ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్.కె. జోషిలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ల ధర్మాసనం ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపి నేడు తుది తీర్పును వెల్లడించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని, విచారణలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కమిషన్ ఇప్పటివరకు సమర్పించిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ తదుపరి వ్యూహంపై ఉత్కంఠ నెలకొంది. రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. కోర్టు లేవనెత్తిన సాంకేతిక అంశాలను ఎలా అధిగమించాలి, విచారణను నిష్పక్షపాతంగా ముందుకు తీసుకెళ్లడానికి కొత్త కమిషన్ను ఏర్పాటు చేయాలా లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే కోణంలో న్యాయ నిపుణుల సలహాలను కేబినెట్ తీసుకోనుంది.
ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రేపు కేబినెట్లో చేసే సూచనల ఆధారంగానే ప్రభుత్వం కాళేశ్వరం విచారణపై మలి అడుగు వేయనుంది. ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులు లేకుండా విచారణను ఎలా పునఃప్రారంభించాలనే దానిపైనే ముఖ్యమంత్రి, మంత్రులు దృష్టి సారించనున్నారు.
Read Also: కాళేశ్వరం వైఫల్యంపై వెనక్కి తగ్గేదేలే.. అవినీతి లెక్కలు తేలుస్తాం, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు