ORR Safety: స్వేచ్ఛ బ్యూరో: మృత్యు మార్గంగా మారిన ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రమాదాలను నివారించే దిశగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించటంతోపాటు యాక్సిడెంట్లను తగ్గించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని నిర్ణయించారు. బంజారాహిల్స్ లోని ఐసీసీసీలో శుక్రవారం హైదరాబాద్ సీపీ వీ.సీ.సజ్జనార్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. దీంట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
80క్రిటికల్ స్పాట్లు..
శాస్త్రీయ పరిశీలన ద్వారా ఓఆర్ఆర్పై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 80 క్రిటికల్ స్పాట్లను ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ప్రమాదాల నివారణకు అవసరమైన మౌళిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. అలాగే ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని నిశ్చయించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను ఆటోమేటిక్గా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
Also Read: శ్రీకాకుళం జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య!
రిపీటెడ్ ఉల్లంఘనలు..
ఈ సందర్బంగా సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ ఓఆర్ఆర్పై నమోదవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనల్లో 99 శాతం రిపీటెడ్ ఉల్లంఘనలు జరుగుతున్నట్టుగా గుర్తించామని చెప్పారు. ఇలా తరచూ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను ప్రత్యేకంగా గుర్తించి వారిపై నిఘా పెంచనున్నట్లు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, అతివేగం, లేన్ క్రమశిక్షణ పాటించకపోవడం వంటి ఉల్లంఘనలపై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాహనం ఏదైనా కారణంతో ఆగిపోతే వెంటనే 14449 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సహాయం పొందాలని సూచించారు.
ఓఆర్ఆర్పై వాహనదారులకు హెచ్చరిక
ఓఆర్ఆర్పై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. అలాగే ఓఆర్ఆర్పై వాహనాలు బ్రేక్డౌన్ అయినప్పుడు వాటిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచనున్నట్టు తెలిపారు. రోడ్డు మధ్యలో వాహనాలను నిలిపివేయడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఆర్ఆర్పై వాహనాలు నిలపవద్దని వాహనదారులను హెచ్చరించారు. సమావేశంలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ రోహిత్ గోపిడితో పాటు ఎన్హెచ్ఏఐ, జీహెచ్ఎంసీ, హెచ్జీసీఎల్, ఐఆర్బీ ఇన్ఫ్రా ప్రతినిధులు, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీలు, అదనపు డీసీపీలు పాల్గొన్నారు.
Also Read: జైలు కూడు వద్దు.. చికెన్, పాస్తా కావాలి.. తీహార్ జైల్లో అమెరికన్ వింత కోరిక!