Farmer Kits: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ చేసే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 క్లస్టర్లలో ఈ పంపిణీ జరుగుతుంది. ప్రతి క్లస్టర్కు 125 మంది చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేస్తారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, గుర్తింపు కోసం ఈ కిట్లో క్లాత్ బ్యాగ్, క్షేత్ర దర్శిని డైరీ, గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ను మరియు చిన్న ప్యాకెట్ డైరీ వంటి వస్తువులు ఉంటాయి.
జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో ఎంపిక చేసి సేంద్రియ వ్యవసాయం పై ప్రత్యేక శిక్షణ ఇచ్చి సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ పథకంలో భాగంగా కృషి సఖిలను క్లస్టర్ కు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి వారికి శిక్షణను ఇచ్చి వారి ద్వారా క్లస్టర్లో 125 మంది రైతులకు సేంద్రీయ సాగు పద్ధతులపై నిరంతరం అవగాహన కల్పిస్తారు. ఈ రైతులకు ప్రకృతి వ్యవసాయం చేసినట్లుగా సర్టిఫికేషన్ చేయించడం జరుగుతుంది. రైతులకు ప్రోత్సాహం అందించడం జీవ ద్రావణాలు తయారు చేసే కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అందుబాటులో ఉంచుతారు.
Also Read: Bribery Punishment India: రూ.500 లంచం కేసు.. మూడున్నర దశాబ్దాల తర్వాత సుప్రీం కోర్టు కీలక తీర్పు
సచివాలయంలో మంత్రి ప్రారంభించిన తర్వాత ఆయా జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు ఫార్మర్ కిట్లను పంపిణీ చేస్తారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. రైతులతో మంత్రి ముఖాముఖీగా మాట్లాడనున్నారు. రైతుల ఇబ్బందులను తెలుసుకోనున్నారు.
Also Read: BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు