BJP Strategy: స్వేచ్ఛ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్ను బలంగా వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. ప్రతి జిల్లాకు ఒక అధికార ప్రతినిధిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే స్థానికంగా ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ భావిస్తోంది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో రాంచందర్ రావు భేటీ అయ్యారు.
ఈ మీటింగ్ లో పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఆయా జిల్లాల్లో ఏం జరిగిందనే విషయంపై పూర్తిస్థాయిలో క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో పార్టీ వాయిస్ ను వినిపించడంలో వెనుకంజలో ఉంటున్నామని గుర్తించి.. ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతినిధులు ఎవరూ తమ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలుగా చెప్పకూడదని, కచ్చితంగా పార్టీ లైన్ కు అనుగుణంగానే మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షడు రాంచందర్ రావు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఏది పడితే అది మాట్లాడి పార్టీకి ఇబ్బంది కలిగించవద్దని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం.
ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మీడియా ప్యానలిస్టులు, సెల్ కన్వీనర్ల నియామకం పూర్తయిందని, త్వరలోనే జిల్లా స్థాయి నియామకాలు కూడా పూర్తి చేస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యూహం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీని మరింత సమర్థవంతంగా సిద్ధం చేయాలని బీజేపీ యోచిస్తోంది.
Also Read: Harish and Sujeeth: హరీష్ గొప్పా? సుజీత్ గొప్పా?.. సుజితే గొప్పంట!