Women Empowerment: స్వేచ్చ బ్యూరో: గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు బలమైన వేదికగా నిలిచే జిల్లా మహిళా సమాఖ్య భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, స్వయం సహాయక సంఘాల మహిళలకు శాశ్వత వేదిక కల్పించడం, మహిళా ఆర్థిక వ్యవస్థను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాలను నిర్మిస్తోంది.ఆడబిడ్డల ఆర్దిక ప్రగతికి చిరునామాగా నిలిచేలా జిల్లా మహిళా సమాఖ్య భవనాలు ప్రారంభానికి సిద్దమవుతున్నాయి.
రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ఈ భవనాల ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 22 జిల్లాల్లో జిల్లా మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులు చేపట్టగా, ఇప్పటికే 17 జిల్లాల్లో పనులు తుది దశకు చేరాయి. ఒక్కో భవనాన్ని సుమారు రూ.5 కోట్ల వ్యయంతో, 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక నమూనాలో నిర్మిస్తున్నారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లాల్లో పర్యటిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు.
మహిళా సంఘాలకు కార్యాలయాలు లేకపోవడంతో సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, ఉత్పత్తుల ప్రదర్శనలు నిర్వహించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతంనిర్మాణం పూర్తవుతున్న ఈ సమాఖ్య భవనాలు మహిళా సంఘాలకు ఒక శాశ్వత కేంద్రంగా మారనున్నాయి. జిల్లా స్థాయిలో మహిళా సంఘాల పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, గ్రామీణ మహిళలకు ఉపాధి, వ్యాపార, మార్కెటింగ్ అవకాశాలు కల్పించే కేంద్రాలుగా ఇవి పనిచేయనున్నాయి.ఈ భవనాల్లో మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు, బ్యాంకింగ్, ఆర్థిక నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు, స్వయం ఉపాధి మార్గదర్శక శిక్షణలు నిర్వహించేందుకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేందుకు ఎగ్జిబిషన్ హాళ్లు, మార్కెటింగ్ సపోర్ట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా సమావేశ హాళ్లు, శిక్షణా కేంద్రాలు, కార్యాలయ గదులు, సకల సదుపాయాలతో కూడిన ఆధునిక నిర్మాణాలుగా ఈ భవనాలను అభివృద్ధి చేస్తున్నారు.
Also Read: మిషన్ తెలంగాణకు షా స్కెచ్.. బీఆర్ఎస్ నేతలే వారి టార్గెట్.. హైదరాబాద్లో తిష్ట వేయనున్న బెంగాల్ టీమ్!
గ్రామీణ మహిళలు ఒకే వేదికపై చేరి తమ సమస్యలను చర్చించుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకోవడం, కొత్త ఉపాధి అవకాశాలను అన్వేషించడం, సంఘాల నిర్వహణలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం వంటి అనేక అంశాలకు ఈ భవనాలు కేంద్ర బిందువులుగా నిలవనున్నాయి. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం ద్వారా మహిళల ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే ఈ సమాఖ్య భవనాలను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం, నిర్ణయాధికారాన్ని పెంచే దిశగా ఈ భవనాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
స్వయం సహాయక సంఘాల మహిళలు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన శక్తి. మహిళలు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు, వారి కార్యకలాపాలకు ఒక శాశ్వత వేదిక అవసరమనే ఆలోచనతో జిల్లా మహిళా సమాఖ్య భవనాలను నిర్మిస్తున్నాం. మహిళలు సమావేశాలు నిర్వహించుకోవడం నుంచి స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకునే వరకు అన్ని అవసరాలకు ఈ భవనాలు ఉపయోగపడతాయి. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా ఇవి కీలక అడుగులు అవుతాయి. మహిళ బలపడితే కుటుంబం బలపడుతుంది.. కుటుంబం బలపడితే గ్రామం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు మహిళ భవనాలను నిర్మిస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డల ఆర్దిక ప్రగతికి చిరునామాగా నిలిచే భవనాలు దేశానికే ఆదర్శం కానున్నాయి.
Also Read: తెలంగాణకు హరితహరం అంతా తుస్సేనా.. పాత హరిత ఫైళ్లు ఓపెన్తో జంకుతున్న గత పాలకులు..?