Hyderabad: బీఆర్ఎస్తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన మంత్రులు మరోసారి పారిపోయారని విమర్శించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి జూపల్లి వస్తానని చెప్పి తోక ముడిచారని, సందట్లో సడేమియా అంటే ఇదేనని అన్నారు. తాము గురువారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్కు వచ్చామని, మంత్రి జూపల్లి రాలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ఫైర్
గన్ పార్క్కు బయలుదేరిన హరీష్రావు, ఇతర నేతలను గేటు దాటకుండానే అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. బీఆర్ఎస్తో చర్చ అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. దమ్ముంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలని సవాల్ విసిరారు. 30 నెలల మీ పాలనలో చేసిన దగా, మోసం వైఫల్యలతోపాటు అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు.
ప్రభుత్వానికి చర్చించే దమ్ము లేదని, చేతకాని వాళ్లు ఎందుకు సవాళ్లు చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ముందు అన్ని వాస్తవాలు ఉంచాలని తాము భావించామని, సవాళ్లు స్వీకరించే సత్తా ముఖ్యమంత్రి, మంత్రులకు లేదని మరోసారి తేలిపోయిందన్నారు. అప్పులు, గురుకులాల్లో అవినీతిపై చర్చకు తాము సిద్ధమేనని పునరుద్ఘాటించారు.
చర్చకు రాకుండా మంత్రులు పారిపోయారని ఎద్దేవా
సవాల్ చేసిన కాంగ్రెస్ మంత్రులు వెనక్కి తగ్గారని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కు వస్తానని చెప్పి గన్పార్క్కు వెళ్లడం ఎందుకని సూటిగా ప్రశ్నించారు. సవాళ్లు విసరడమేకాదు.. వాటిని నిలబెట్టుకునే ధైర్యం ఉండాలన్నారు.
ఇదిలా వుండగా గన్పార్క్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. తాను సవాల్ కేటీఆర్-హరీశ్రావులకు కాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్కు విసిరానని, తాను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవితోపాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని మరొక సవాల్ విసిరారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలపై చర్చకు సిద్ధమేనన్నారు. రూ.7.3 లక్షల కోట్ల అప్పులు చేసిందని మంత్రి, అందులో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.74వేల కోట్ల అప్పు చేసిందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, తాము అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పాలన్నారు. తాను చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేసేందుకు సిద్ధమేనన్నారు.
ALSO READ: తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు.. ఎలాగో తెలుసా?
తాము చేసిన ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు మంత్రి జూపల్లి. తన వద్ద రికార్డులు ఉన్నాయని అన్నారు. హరీశ్రావు, కేటీఆర్ ఇంకా బుకాయిస్తున్నారని, బీఆర్ఎస్ చేసిన అప్పులను కేసీఆర్ మీడియాకు చెప్పాలన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతీ నెలా రూ.6వేల కోట్ల వడ్డీ కడుతున్నామని తెలియజేశారు.