CM Revanth Reddy: హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్ లో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న రేవంత్.. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
మల్టీ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్
సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవెల్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదన్న రేవంత్.. మల్టీ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మరోవైపు రాష్ట్రాన్ని మూడు భాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE)గా అభివృద్దిని మూడు భాగాలుగా విభజించుకున్నట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు క్యూర్ ఏరియాను సర్వీస్ సెక్టార్ గా గుర్తించామని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట, రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్యూర్ ఏరియాను మాన్యూఫ్యాక్చర్ సెక్టార్ గా పేర్కొన్నారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రేర్ ఏరియాను అగ్రికల్చర్ సెక్టార్ గా గుర్తించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: Tamil Nadu Politics: సీఎం కాకముందే.. విజయ్కు చుక్కలు చూపిస్తున్న చిన్నపార్టీలు..!
తెలంగాణ సమగ్రాభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ‘తెలంగాణ రైజింగ్-2047’ మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించుకున్నట్లు సీఎం రేవంత్ గుర్తుచేశారు. మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయడంతో పాటు మన సంస్కృతికి అనుసంధానించబోతున్నామని అన్నారు. నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో భాగంగానే ఆర్టీసీలో ఈవీ బస్సులను తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నట్లు కూడా రేవంత్ చెప్పుకొచ్చారు.
Also Read: కైలాసగిరిపై భారీ త్రిశూలం.. ప్రారంభించిన మంత్రులు.. ప్రత్యేకతలు తెలిస్తే షాకే!