Advanced Weather Stations: బ్యూరో స్వేచ్ఛ: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అంతేగాక ఆయా స్టేషన్లలో రూ.100 కోట్లతో నూతన ఎక్విప్ మెంట్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే ఇతర దేశాల్లో వినియోగిస్తున్న హై టెక్నాలజీ ఎక్విప్ మెంట్లపై ప్రభుత్వం గతంలోనే ఓ స్టడీ చేసింది. ఓ ప్రత్యేక టీమ్ విదేశాల్లో వినియోగిస్తున్న పరికరాలు, ఫలితాలు వంటి వాటిపై అధ్యయనం చేసింది. ఆ తర్వాత ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. మన రాష్ట్రంలోనూ వెంటనే అడ్వాన్సుడ్ సిస్టమ్ ను తీసుకురావాలని ఈ నిర్ణయం తీసుకున్నది. అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు, ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ కొత్త టెక్నాలజీతో మరింత వేగంగా నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. సామాన్యులకు సవాళ్లు ఎదురు కాకుండా “నయా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్” కు ఆమోద ముద్ర వేసింది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్తో ప్రతి మండలాన్ని ఒక నిఘా కేంద్రంగా మార్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమంటూ ఓ ఆఫీసర్ తెలిపారు.
ఇప్పటి వరకు వాతావరణ అంచనాలు కేవలం జిల్లా కేంద్రాలు లేదా కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేవి.కానీ రాష్ట్రంలోని ప్రతి మండలంలో అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలను కాస్త ముందుగానే పసిగట్టే వెసులుబాటు ఉంటుంది. ఇవి కేవలం వర్షపాతాన్నే కాకుండా గాలిలో తేమ,వేగం,ఉష్ణోగ్రత మార్పులను ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్కు చేరవేస్తాయి. దీనివల్ల ఏ గ్రామంలో ఎంత వర్షం కురుస్తుందో గంటల ముందే కచ్చితమైన సమాచారం లభిస్తుంది. తద్వారా రైతులు, ప్రజలను ముందుగానే అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేగాక పాతకాలపు పద్ధతులకు స్వస్తి పలుకుతూ ప్రభుత్వం విదేశీ సాంకేతికతను రంగంలోకి దించుతోంది. అతి తక్కువ సమయంలో మేఘాల గమనాన్ని పసిగట్టే డాప్లర్ రాడార్ల నెట్వర్క్ అందుబాటులోకి రానున్నది. అంతేగాక నదులు, వాగుల వద్ద నీటి మట్టం పెరగగానే అలర్ట్ చేసే ఆటోమేటిక్ సెన్సార్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. నెట్వర్క్ లేని సమయంలోనూ పనిచేసే శాటిలైట్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు ఈ వేదర్ స్టేషన్లలో సమకూర్చనున్నారు. వరదలు, అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించడానికి విపత్తు కు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, డ్రోన్లు, శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్, ఆధునిక రెస్క్యూ పరికరాలు, అత్యాధునిక ఫైర్ , సెర్చ్ ఆపరేషన్ల సాంకేతికతను రెవెన్యూ,విపత్తు నిర్వహణ విభాగాలకు అందజేయనున్నారు.
Also Read: Tirumala Ghee Case Updates: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్లలో డైయిరీ నిపుణుడు, సైంటిస్ట్
భారీ వర్షాలు వరదల సమయంలో వాగుల్లో వంకల్లో చెరువుల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి ఎయిర్లిఫ్ట్ మెకానిజం తయారు చేసుకోవాలని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని తరలించడానికి 70 నుంచి 80 కిలోల బరువును ఎత్తే డ్రోన్లను కొనుగోలు చేయనున్నారు. దీంతో పాటు హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా మాట్లాడడానికి వీలుగా సిమ్ ఆధారిత విహెచ్ ఎఫ్ రేడియో సిస్టమ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ నగరంలో హైరైజ్డ్ భవనాలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని సమర్దవంతంగా ఎదుర్కొనేలా అవసరమైన పరికరాలను సైతం కొనుగోలు చేయనున్నారు. దీంతో పాటు 77 హైస్పీడ్ బోట్లను అందుబాటులో తీసుకురానున్నారు.
కేవలం పరికరాలతోనే కాకుండా స్టాఫ్ లో స్కిల్స్ పెంపొందించేందుకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ కేంద్రంలో విపత్తు నిర్వహణ బృందాలకు, స్థానిక అధికారులకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తారు.డ్రోన్ల వినియోగం, బాధితుల సహాయక చర్యలు, అత్యవసర వైద్యంపై ఇక్కడ నిపుణులు తర్ఫీదునిస్తారు. బ్యాచ్ ల వారీగా ఎంపిక చేసి జిల్లా ముఖ్య అధికారులు ఎంపిక చేసిన విధానంలో ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. రాష్ట్రంలో 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉండగా, ఒక్కో బృందంలో వెయ్యిమంది వరకు ఉన్నారని వీరందరికీ ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వనున్నారు. స్టాఫ్ సంఖ్యను పెంచేందుకు కూడా ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టనున్నారు.
ఈ కొత్త వ్యవస్థ వల్ల అతిపెద్ద ప్రయోజనం పొందేది రైతులే. అకాల వర్షాల వల్ల కోతకు వచ్చిన పంటలు తడిసిపోకుండా ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అలాగే, లోతట్టు ప్రాంతాల ప్రజలను వరద రాకముందే సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా ప్రాణనష్టాన్ని సున్నాకు తగ్గించవచ్చు.ప్రకృతి వైపరీత్యాలను ఆపలేకపోయినా.. సాంకేతికత సాయంతో వాటి ప్రభావం నుంచి కొంత వరకు తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ డిజాస్టర్ మేనేజ్ మెంట్ లో కీలకమార్పును తీసుకురానున్నది.
Also Read: Shoaib Akhtar: పాకిస్తాన్ చెత్తనాకొడుకుల గురించి ఇక అడగకండి…లైవ్ డిబేట్ లో షోయబ్ అక్తర్ తాండవం