T Fiber Net: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది టీ-ఫైబర్ ప్రాజెక్టు. త్వరలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగు తున్నాయి. దీనివల్ల రూరల్, అర్బన్ ప్రాంతాల్లో తక్కువ ధరకే ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ సేవలు చక్కగా వినియోగించుకోవచ్చు.
ప్రపంచమంతా ఇప్పుడు ఇంటర్నెట్ చుట్టూనే తిరుగుతోంది. పిల్లలకు పాఠాలకు మొదలు ఉద్యోగం వరకు అంతా అందులోనే. ఈ నేపథ్యంలో టీ-ఫైబర్కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది ప్రస్తుత ప్రభుత్వం. ఇంటర్నెట్, టీవీ చానళ్లు, ఓటీటీలు వంటి సేవలన్నింటినీ ఒకే వేదికపై వచ్చేలా టీ-ఫైబర్ను అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పోరేషన్.
తొలిదశలో గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామపంచాయతీల పరిధిలో 42 వేల కిలోమీటర్ల మేరా ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేశారు. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు తొలుత పట్టణ ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది.
సాంకేతికంగా సమస్యలున్నప్పటికీ కొన్ని గ్రామాలు మినహా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది. ఎనిమిది నెలల నుంచి రంగారెడ్డి, నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల నుంచి ఒక్కో గ్రామాన్ని తీసుకుని నాలుగు గ్రామాల్లో టీ-ఫైబర్ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ అడుగులు వేస్తున్నారు.
ALSO READ: బాలికల హాస్టల్ లోకి బీరు బాటిల్.. పేరెంట్స్ ఆగ్రహం
దసరాకి సేవలు ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది. ఒకవేళ మిస్సయితే కార్తీకమాసంలో ఖాయమని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేలపై గ్రామాల్లో అందుబాటులోకి రాబోతోంది. మార్కెట్లో ఉన్న రెండు, మూడు పెద్ద కంపెనీలు అందిస్తున్న ధరల్లో టీ-ఫైబర్ ప్లాన్లు అందించనుంది. కనెక్షన్ తీసుకున్నవారికి సెట్టాప్ బాక్స్ను అందిస్తారు. ఆ బాక్సుతో టీవీ స్మార్ట్ని కనెక్ట్ చేయవచ్చు.
టీవీకి వెబ్ కెమెరాను అనుసంధానించుకుంటే వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులను నిర్వహించే ఛాన్స్ ఉంది. దాని ద్వారా వైఫై సదుపాయం పొందవచ్చు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేకపోయినా ఇంట్లో నుంచే పాఠాలు వినొచ్చు కూడా. కరెంటు, గ్యాస్ బిల్లులు చెల్లించుకోవచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగులైతే వర్క్ఫ్రం హోంను చేసుకోవచ్చు కూడా.
అలాగే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వాటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో పోల్ ద్వారా తెలుసుకోవచ్చు. కేవలం రిమోట్ ద్వారానే ప్రజలు సర్వేలో పాల్గొనవచ్చు. టీవీ చానల్స్ను మార్చేందుకు వినియోగించే రిమోట్ను ఫోన్లా వాడుకోవచ్చు. అందుకు సంబంధించి కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు.
ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతోంది కూడా. టీ-ఫైబర్ కనెక్షన్ కోసం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబరు, టీవీ, స్మార్ట్ఫోన్, ట్యాబ్, ఒక ల్యాప్ట్యాప్లో లాగిన్ కావచ్చు. కేబుల్ ద్వారా అందించే ఈ కనెక్షన్తో ఒక జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను అందించాలన్నది ప్రభుత్వం ప్లాన్.
ఇప్పటికే మహబూబ్నగర్, జనగామ, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, వరంగల్ రూరల్, పెద్దపల్లి, జగిత్యాల, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆయా సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగర్కర్నూల్, సంగారెడ్డి, సూర్యాపేట, మెదక్, నల్గొండ జిల్లాల్లో కేబుల్ పనులు త్వరలో పూర్తికానున్నాయి కూడా.
వీటి మరమ్మతులు, సర్వీసులను అందించే టెక్నీషియన్ల నియమించనుంది. గ్రామీణ యువతకే శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని ఫైబర్గ్రిడ్ అధికారులు డిసైడ్ అయ్యారు. మొదటిదశలో 35 వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. లోకల్ కేబుల్ ఆపరేటర్లకు అవకాశం కల్పించనుంది.