Telangana Govt: ఆస్తుల క్రయ-విక్రయాలపై కొత్త పద్దతిని తీసుకొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. జూన్ రెండు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని స్వయంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
స్లాట్ బుకింగ్ విధానమంటే ఏంటి?
ఆస్తులు అమ్మకోవడానికి గానీ, కొనుగోలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పద్దతి తీసుకొచ్చింది. అదే స్లాట్ బుకింగ్ విధానం. దీనివల్ల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి ఆఫీసుల వద్ద నిరీక్షించే అవసరం ఏమాత్రం ఉండదు. కేవలం పావు గంటలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికానుంది. స్లాట్ బుకింగ్ ఎంపిక చేసుకున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే భూముల రిజిస్ట్రేషన్ చేస్తారు. స్లాట్ బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయరు. ఇప్పటివరకు 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఈ విధానం అమలు జరిగింది. మిగిలిన 97 ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం మొదలుకానుంది.
రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను అదే రోజు కొనుగోలుదారుకు అందజేస్తారు అధికారులు. తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ రోజు నిర్దేశించిన సమయానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నేరుగా విచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. దీనికి సంబందింది నేరుగా registration.telangana.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
స్లాట్ బుకింగ్ విధానం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువు అవుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతీ రోజు ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు ప్రక్రియ జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ తర్వాత లాగిన్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోర్టల్లో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.
ALSO READ: భార్య లేని లోకంలో ఉండలేక.. యాసిడ్ తాగి ఆత్మహత్య
ఆదాయం పెరగడం ఖాయం
రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు సదరు మంత్రి. నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి పొంగులేటి. భూ భారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ను ఏర్పాటు చేశామన్నారు. అందులో నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరచడం జరుగుతుందన్నారు.
ఒకవేళ ఎక్కడైనా నిషేధిత జాబితాలో భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే క్షణాల్లో ప్రధాన కార్యాలయంలో తెలిసేలా వ్యవస్ధను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్ధీకరణ చేస్తున్నట్లు తెలిపారు. పని భారం అధికంగా ఉన్న పఠాన్ చెరువు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం , సూర్యాపేట, జడ్చర్ల ,మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్ మొత్తం తొమ్మిది చోట్ల అదనపు సబ్ రిజిస్ట్రార్తోపాటు సిబ్బందిని నియమించారు. ఇప్పటికే అమలు చేసిన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఎక్కువగా జరిగాయి.
కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న రియల్ వ్యాపారం పుంజుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 2025-26 ఆర్థిక ఏడాది ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్లాట్ బుకింగ్ విధానం రిజిస్ట్రేషన్లశాఖ ఆదాయానికి కలసి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.