Hyderabad News: స్వార్థ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తో ఆటలు ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణలోని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు. కసి, పట్టుదలతో తమ పిల్లలు ర్యాంకులు సాధించారని అన్నారు. ఇప్పుడు నోటికి వచ్చినట్టు నిందలు వేయడం సరికాదన్నారు. మాకు కచ్చితంగా న్యాయం కావాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో జరిగిన గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల మెరిట్ లిస్టుపై వారం కిందట హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పేపర్ల రీవాల్యూయేషన్ చేయాలని ఆదేశించింది. లేకుంటే మెయిన్స్ పరీక్షను మరోసారి నిర్వహించాలని తన తీర్పులో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
దాదాపు 563 మంది ర్యాంకర్లు, మరో 100 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాంకర్లు పేరెంట్స్ మాట్లాడారు. మళ్లీ పరీక్షలు పెట్టాలని అంటున్నారని, ఫీజులు ఎవరు కడతారని ప్రశ్నించారు. 3 కోట్లు పెట్టి ఎగ్జామ్ పాసయ్యారని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరైతే ఆ తరహా ఆరోపణలు చేస్తున్నారో ఆధారాలను చూపాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి ఆరోపణలతో మనోవేదనకు గురి చేస్తున్నారని పలువురు పేరెంట్స్ కంటతడి పెట్టారు. మీ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని, ఈ విషయంలో అన్ని పార్టీల నేతలు సహకరించాలని కోరారు. పిల్లలు ఎంతో కష్టపడి గ్రూప్-1 పరీక్షలో పాస్ అయ్యారని, ఈ విషయంలో హైకోర్టు తమకు న్యాయం చేయాలని కోరారు.
ALSO READ: అక్టోబర్ రెండున ఏం జరగబోతోంది? ఆ రోజు లిక్కర్, మీట్ షాపులు తెరిచే ఉంటాయా?
పోస్టులు కొనుగోలు చేశామని చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని అన్నారు. ఈ విషయంలో దుష్ప్రచారాలు వ్యాప్తి చేయకుండా నిజాలు తెలియపరచాలని కోరారు. ఈ క్రమంలో పేరెంట్స్ వారి ఉద్యోగాలు, కష్టపడిన తీరును వివరించారు. ర్యాంకర్లతో అక్కడికి వచ్చినవారిలో కొందరికి తండ్రి లేనివారు ఉన్నారు. మరికొందరికి తల్లి లేనివారు ఉన్నారు.
ఈ క్రమంలో వారు కష్టపడి పిల్లలను చదివించిన తీరును వివరించారు. తాము అన్ని కష్టాలు పడి పిల్లలను చదివిస్తే.. లేనిపోని విధంగా అవాస్తవాలు ప్రచారం చేస్తారా? అంటూ ఒకానొక దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.
ఈ వ్యవహారం జరుగుతుండగానే TGPSC కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. జాగృతి నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు, నాంపల్లి సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
తెలంగాణలో జరిగిన గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, వాల్యూయేషన్లో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టు తలుపు తట్టారు. పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. క్వాలిఫై అయిన కొందరు అభ్యర్థులు పరీక్షను రద్దు చేయరాదంటూ మరికొన్ని పిటిషన్లను దాఖలు చేశారు. ఈ రెండింటిని కలిపి విచారించిన న్యాయస్థానం 222 పేజీలతో తీర్పు వెల్లడించింది.
మీడియా ముందుకు గ్రూప్-1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు
హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత తమపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం
గ్రూప్-1పై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని, ఒక్కో పేరెంట్ రూ.3 కోట్లు పెట్టి పోస్టులు కొన్నారని ఆరోపణలు చేస్తున్నారని అంటున్న తల్లిదండ్రులు… https://t.co/USVfhcUuYG pic.twitter.com/VrFnmvMWA0
— BIG TV Breaking News (@bigtvtelugu) September 16, 2025