TG Inter Exams2026: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 25 నుంచి ప్రారంభమై మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఆ సంఖ్యకు అనుగుణంగా తెలంగాణ వ్యాప్తంగా 1495 కేంద్రాలను పరీక్షల కోసం ఏర్పాటుచేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 9,97,075 మంది విద్యార్థులుండగా ఫస్టియర్ లో 4,89,126 మంది, సెకండియర్ లో 5,07,949 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదిలా ఉండగా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 5 నిమిషాలు ఆలస్యమైనా రాసేందుకు అనుమతించనున్నారు. 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇవ్వనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు వాటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 404, ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలలు 221, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 863, పాఠశాలలు, ఇతర కళాశాలలు 7 ఉన్నాయి. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను కళాశాలల నుంచి లేదా అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను పారదర్శకంగా, ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించడానికి బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణ కోసం 28,500 మంది ఇన్విజిలేటర్లు, 1,495 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,495 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.
Also Read: Om Shanthi Shanti Shantihi OTT: ఓటీటీలోకి తరుణ్, ఈషా రెబ్బాల పెళ్లి.. వివరాలివే!
అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫర్నీచర్, వాల్ క్లాక్, వైద్య సదుపాయాలు కల్పించారు. విద్యార్థులు పరీక్ష హాలులోకి ఎలాంటి ప్రింటెడ్, రాతపూర్వక మెటీరియల్, సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడానికి ‘టెలీ-మానస్’ టోల్ ఫ్రీ నంబర్ 14416 ద్వారా కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా సహాయం కోసం రాష్ట్ర కంట్రోల్ రూమ్ నంబర్లు 040-24655027, 9240205555 నంబర్లను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. పరీక్ష సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, వైద్య శాఖ, పోస్ట్ ఆఫీస్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో బోర్డు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తోంది.
ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే బోర్డుకు ఫోన్ చేయాలని సూచించారు. మొదటి ఏడాది విద్యార్థుల కంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. జోన్ ఆధారంగా విద్యార్థులను జంబ్లింగ్ చేసినట్లు చెప్పారు. ఎక్కడా సమస్యాత్మకమైన కేంద్రాలు లేవని వివరించారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై మూడు నెలల ముందు నుంచే కసరత్తు చేపట్టి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు.
మొత్తం విద్యార్థులు – 9,97,075
ఫస్టియర్ విద్యార్థులు – 4,89,126
సెకండియర్ విద్యార్థులు – 5,07,949