Construction Waste: స్వేచ్ఛ బ్యూరో: భవన నిర్మాణ వ్యర్థాలు ఇకపై ఎక్కడబడితే అక్కడ వేస్తామంటే కుదరదు. గతేడాది కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కఠినమైన నిబంధనలకు సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేక ఆదేశాలను అమల్లోకి తెస్తున్నట్లు జీవో నెంబర్ 626 ను జారీ చేసింది. హైదరాబాద్లో భవన నిర్మాణ వ్యర్థాల అక్రమ రవాణాపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో భవన నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన, నాలాలు, చెరువులలో అక్రమంగా వేయడంపై కఠిన చర్యలుంటాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
భవన నిర్మాణ లేదా కూల్చివేతల ప్లాన్ అనుమతుల సమయంలోనే వ్యర్థాల నిర్వహణ, వినియోగ ప్రణాళికను సమర్పించడం తప్పనిసరి చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. లేని పక్షంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నిలిపివేయనున్నట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం వ్యర్థాలను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించకపోతే సదరు భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీని నిలిపేయనున్నట్లు, ప్రభుత్వం చేపట్టనున్న పనుల్లో రీసైకిల్డ్ మెటీరియల్ ను కనీసం పది శాతమైనా వినియోగించాలన్న నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు సర్కారు జీవోలో స్పష్టం చేసింది. సర్కారు పనులు జరిగే స్థలం నుండి వ్యర్థాలను పూర్తిగా తొలగించి, వాటిని సమర్పించిన సీ అండ్ డీ ప్లాంటు నుంచి డిస్పోజల్ సర్టిఫికేట్ సమర్పించే వరకు కాంట్రాక్టర్ల బిల్లులు నిలిపేయనున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది.
రోడ్డు కటింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వెల్లడించింది. రోడ్డు కటింగ్ అనుమతులు కావాలంటే వ్యర్థాల రీసైక్లీంగ్ చేసే సంస్థతో చేసుకున్న ఒప్పంద పత్రాలను చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారి నుంచి భారీ జరిమానాలు, వాహనాల సీజ్, అనుమతుల రద్దు చేయటం, బ్లాక్లిస్ట్లో పెట్టడం వంటి చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిపై అవసరమైతే పోలీసుల సహాయంతో చట్టపరమైన కేసులు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది. అంతేగాక, అధికారిక రీసైక్లింగ్ కేంద్రాలను కూడా సర్కారు ప్రకటించింది. వాటిలో శంషాబాద్, తూంకుంట, జీడిమెట్ల, ఫతుల్లాగూడ లలోని అధికారిక ప్లాంట్లకు మాత్రమే ఈ వ్యర్థాలను తరలించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఆదేశాలు గత ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
కోర్ అర్బన్ రీజియన్ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వం క్యూర్-1 కామన్ బిల్లింగ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. దీంతో అన్ని రకాల బిల్లులను ఒకే వేదిక ద్వారా చెల్లింపులు జరిపే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది క్యూర్-1 (కామన్ యూనిఫైడ్ బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టమ్) పేరుతో సరికొత్త డిజిటల్ విధానాన్ని తీసుకువస్తూ మెట్రోపాలిటన్ ప్రాంతం, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ యాప్ ను దీనిని అమలు చేయనున్నారు.
ప్రజలు ఇకపై వివిధ ప్రభుత్వ విభాగాల చెల్లింపుల కోసం వేర్వేరు పోర్టల్స్ వాడాల్సిన అవసరం లేదని, ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, తాగునీటి సరఫరా-డ్రైనేజీ ఛార్జీలు, ట్రాఫిక్ చలాన్లను ఈ క్యూర్-1 యాప్ తో చెల్లించవచ్చునని సర్కారు తెలిపింది. ఈ ఉత్తర్వులు జారీ అయిన మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లింపులను స్వీకరించేందుకు వినియోగిస్తున్న పాత యాప్ లను నిలిపేసి, ఈ సరికొత్త ఉమ్మడి వ్యవస్థలోకి మారాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది. క్యూర్ -1 యాప్ వెబ్ ప్లాట్ఫారమ్ రూపకల్పన, భద్రత బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చూసుకుంటున్నట్లు సర్కారు స్పష్టం చేసింది.
Also read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. లేబర్ కార్డుల దందాపై కదిలిన యంత్రాంగం!