Sridhar Babu: కృత్రిమ మేధ (AI) రంగంలో భద్రత అనేది ఆవిష్కరణలకు అడ్డంకి కాదని.. అది వృద్ధిని వేగవంతం చేసే ‘ఏరోడైనమిక్స్’ వంటిదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ స్ట్రాటెజిక్ అడ్వయిజరీ సంస్థల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. సరైన నియంత్రణలు లేని వృద్ధి తాత్కాలికంగా అద్భుతంగా అనిపించినా.. ఒక్క చిన్న పొరపాటు దశాబ్దాల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. విమానయాన రంగంలో సీటు బెల్టులు, రాడార్ వంటి భద్రతా ప్రమాణాలు ఆ రంగాన్ని ఎలాగైతే ఉన్నత శిఖరాలకు చేర్చాయో.. ఏఐ విషయంలోనూ భద్రత అదే పాత్ర పోషిస్తుందని ఆయన అభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఒక చారిత్రక వృద్ధి దశలో ఉందని మంత్రి పేర్కొన్నారు. 1980లలో ఒక చిన్న గ్రామంగా ఉండి నేడు 500 బిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనాలోని షెన్జెన్ నగరం తరహాలోనే తెలంగాణ ప్రయాణం సాగుతోందని ఆయన ఉదహరించారు. అయితే తెలంగాణ వృద్ధికి ‘టెక్నాలజీ’ ప్రధాన ఇంజిన్గా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు.
ప్రభుత్వ వ్యూహంలో భాగంగా క్షేత్రస్థాయిలో చేపడుతున్న వినూత్న చర్యలను మంత్రి వివరించారు. దేశంలోనే తొలి నెట్-జీరో నగరం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ , 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘ఏఐ సిటీ’ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే.. ప్రపంచంలోనే మొట్టమొదటి సార్వభౌమ ఓపెన్ డేటా పైప్లైన్ ‘తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్’ (TGDeX) ద్వారా 28 ప్రభుత్వ శాఖల డేటాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం దీనిని 360 ఏఐ మోడల్స్, వందలాది అంకుర సంస్థలు వినియోగించుకుంటున్నాయని వెల్లడించారు.
చివరగా.. పౌర సేవలను మరింత చేరువ చేసేందుకు 2027 నాటికి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్ఫారమ్ (IDSP)ద్వారా 300కు పైగా సేవలను నేరుగా ప్రజల అరచేతిలోకి తీసుకువస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏఐ భద్రతా ప్రమాణాల కోసం తెలంగాణ ఇతరులపై ఆధారపడకుండా.. తన 4 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సొంతంగా రియల్ టైమ్ నిబంధనలను రూపొందిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాంకేతికత అనేది మనం పీల్చే గాలిలా సురక్షితంగా.. అంతర్లీనంగా ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు ముగించారు.
Also Read: పోలీసుల వలలో ‘మోస్ట్ వాంటెడ్’ ఖాజా.. 28 కిలోల గంజాయి స్వాధీనం!