GHMC: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మరింత మెరుగైన సేవలందించే అంశంపై సర్కారు ఫోకస్ చేసింది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న సర్కారు పబ్లిక్ విజిబిలిటీ సేవలను ముమ్మరం చేసేందుకు సిద్దమైందని చెప్పవచ్చు. మూడు కార్పొరేషన్ పరిధిలో అన్ని రకాల సేవలను పారదర్శకంగా అందించేందుకు వీలుగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ నిర్వహించాలని సర్కారు ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ (జీహెచ్ఎంసీ-1) మెమో జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జారీ చేసారు.
ఆదేశాల ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కమిషనర్లు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించింది. రోజువారీ కార్యక్రమాలుగా విభజించి ప్రత్యేక షెడ్యూల్ అమలుకు అనుకూలమైన కార్యాచరణ రూపకల్పన చేయాలని సర్కారు మూడు కార్పొరేన్లకు సూచించింది. ఈ నెల 23 నుంచి యాక్షన్ ప్లాన్ అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది. ఈ యాక్షన్ ప్లాన్లో ముఖ్యంగా పౌరుల భాగస్వామ్యం పెంపు, సేవల సరఫరాలో మెరుగుదల, సంస్థాగత సంస్కరణలు, పారదర్శకత, సమర్థత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్కారు ఆదేశాల్లో సూచించింది.
Also Read: Mohan Babu :మోహన్ బాబుకు కు హైకోర్టులో చుక్కెదురు.. కిడ్నాప్ కేసులో అరెస్ట్ తప్పదా..?
ఇక ఇందుకు సంబంధించి సిద్ధం చేసిన తాత్కాలిక కార్యాచరణ ప్రణాళికను బుధవారం మూడు కార్పొరేషన్ల కమిషనర్లు ప్రభుత్వానికి సమర్పించాలని గడువు విధించినట్లు తెలిసింది. దీనిని అత్యవసర, ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని కమిషనర్లకు సూచించారు. మూడు కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరణ అనంతరం పరిపాలన మరింత వేగవంతం కావాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ కీలకంగా మారనుంది. జీహెచ్ఎంసీ వివిధ విభాగాల వారీగా అందిస్తున్న సేవలు విలీన ప్రాంతాల్లో ముమ్మరం కానున్నాయని చెప్పవచ్చు. పట్టణ పరిపాలనలో కనిపించే లోపాలను సరిదిద్దడం, పౌర సేవలలో నాణ్యత, పారదర్శకత, జవాబుదారితనం పెంపు, బాధ్యతాయుతమైన పరిపాలనకు ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ దోహదపడుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.