MeeSeva services on WhatsApp: ‘పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మంగళవారం బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణాలో మెటా, మీ సేవ సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించిన ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిపాలన అంటే కేవలం నాలుగు గోడల మధ్య ఉండి చేసేది కాదని, టెక్నాలజీ సాయంతో పౌర సేవలను సామాన్యుల ముంగిటకే చేర్చడమే నిజమైన ‘గుడ్ గవర్నెన్స్’ అని అభివర్ణించారు. గత ప్రభుత్వం రాచరిక పోకడలతో వ్యవహరించిందని, కానీ తమ ప్రభుత్వం టెక్నాలజీని ఒక సమానత్వ సాధనంగా చూస్తూ, దాని ఫలాలను మారుమూల ప్రాంతంలోని చివరి వ్యక్తికి కూడా అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.
తాజా ఆవిష్కరణతో ప్రజలు తమ వేలికొనల నుంచే వాట్సాప్ ద్వారా సులభంగా ప్రభుత్వ సేవలను పొందవచ్చని మంత్రి తెలిపారు. మీ సేవ ద్వారా అందించే 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన దాదాపు 580కి పైగా పౌర సేవలను ఈ వాట్సాప్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. జెన్ ఏఐ (Gen AI), మొబైల్ ఫస్ట్ అప్రోచ్ ద్వారా పౌర సేవల డెలివరీ విధానాన్ని సమూలంగా మార్చిన ఘనత తెలంగాణకే దక్కుతుందని అన్నారు. త్వరలోనే ఈ సేవలను తెలుగు, ఉర్దూ భాషల్లోనూ అందించడంతో పాటు, టైప్ చేసే పని లేకుండా కేవలం వాయిస్ కమాండ్తో సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు.
ఏటా 10 లక్షల మంది తెలంగాణ యువతను ‘ఏఐ’ నిపుణులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత డిజిటల్ ఎక్స్ ఛేంజ్, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఇన్నోవేషన్ హబ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఒక బెంచ్ మార్క్ను సెట్ చేస్తోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, మీ సేవ కమిషనర్ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: X, AWS, ChatGPT డౌన్.. సోషల్ మీడియా, న్యూస్ వెబ్ సైట్లకు అంతరాయం