Road Development: స్వేచ్చ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఆదివారం స్టేజ్–1, ప్యాకేజ్–2/7లో భాగంగా రూ.339.59 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 109.3 కిలోమీటర్ల పొడవైన రహదారుల అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా భువనగిరి నుండి చిట్యాల వరకు రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారి కోసం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని, రహదారి పూర్తయితే జిల్లాలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గి, ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.దశాబ్దాలుగా ఈ రహదారి విస్తరణ కోసం ప్రజలు ఎదురుచూస్తుండగా, ప్రజా ప్రభుత్వం ఆ కోరికను నెరవేరుస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, రహదారి భద్రత మెరుగుపడి, రవాణా సౌకర్యాలు విస్తరించి, ప్రాంతీయ వాణిజ్యం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు లభించనుంది.
అలాగే వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ అంశాలపైనా స్పందిస్తూ.. మరో ఆరు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
Also read: WhatsApp వాడేవారందరూ తప్పక మార్చాల్సిన 10 ముఖ్యమైన సెట్టింగ్స్!
తెలంగాణ అభివృద్ధికి అవసరమైన కేంద్ర నిధుల కోసం పార్లమెంట్లో బలంగా పోరాడతానని తెలిపారు. గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, రానున్న రెండున్నరేళ్లలో గ్రామాల్లో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా అమలవుతున్నాయని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రహదారులు, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రహదారి సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని తెలిపారు.
రూ.274.79 కోట్లతో మూడు ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం భువనగిరి నియోజకవర్గ అభివృద్ధిలో కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
Farmer DISCOM: రైతు డిస్కంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బావుల వద్ద కరెంట్ మీటర్లపై కీలక ప్రకటన!
అదేవిధంగా ఈ నెల 17వ తేదీన ధర్మారెడ్డి కాలువ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రైతులకు సాగునీరు అందించి వారి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక చొరవతో భువనగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల అవసరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండ–వెలివర్తి–పోచంపల్లి–చౌటుప్పల్ రహదారి, బీబీనగర్–వెంకిర్యాల రహదారి,చిన్నారావుపల్లి–వెంకిర్యాల రహదారి, రేపాక–వీరవెల్లి–యాదాద్రి రహదారి అభివృద్ధి పనులను కూడా మంజూరు చేయాలని కోరారు.
నాగారం–చౌటుప్పల్ రహదారి అభివృద్ధి (ఎస్.లింగోటం నుంచి జాలుకాలువ వరకు 18.5 కి.మీ) – రూ.21.43 కోట్లు.భువనగిరి–చిట్యాల నాలుగు లైన్ల రహదారి విస్తరణ (నాగిరెడ్డిపల్లి–టేకులసోమారం–వలిగొండ–రామన్నపేట వరకు 40 కి.మీ) – రూ.239.75 కోట్లు. రాయగిరి–మోత్కూర్ రహదారి నుంచి భువనగిరి–చిట్యాల రహదారి వరకు అభివృద్ధి (నాగిరెడ్డిపల్లి–చందుపట్ల–బండసోమారం వరకు 15.5 కి.మీ) – రూ.13.61 కోట్లు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల, పట్టణ అధ్యక్షులు, పిఎసిఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Also read: CURE Bill: లీకైన తెలంగాణ క్యూర్ బిల్లు సీక్రెట్స్.. ఇకపై మున్సిపాలిటీల్లో నడవని మేయర్ల హవా!