తెలంగాణ రాష్ట్రంలోని మీసేవ కేంద్రాల్లో వివిధ సేవల ధరలను ప్రభుత్వం భారీగా పెంచింది. అన్ని రకాల సర్వీసులపై సుమారు 50 శాతం మేర చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం సహా నిర్వాహకుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
సాధారణంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే ఆదాయం (Income), కులం (Caste) నివాస (Residence) ధ్రువీకరణ పత్రాల ధరలు గతంలో రూ.45 నుంచి రూ.55 మధ్యలో ఉండేవి. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం వీటి ధరను ఏకంగా రూ.80కి పెంచింది. అదేవిధంగా జనన ధ్రువీకరణ పత్రం (Birth Certificate) ప్రింట్ తీసుకోవడానికి గతంలో రూ.40 నుంచి రూ.45 వరకు వసూలు చేసేవారు. ప్రస్తుతం ఆ ధరను రూ.62కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కసారిగా ధరలు ఇంతలా పెరగడంపై సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల నిర్వాహకులు చాలా కాలంగా తమ కమీషన్ పెంచాలని కోరుతున్నారు. కరెంటు బిల్లులు పెరగడం ఇంటర్నెట్ చార్జీలు ఆఫీసు అద్దెలు సిబ్బంది జీతాలు పెరగడంతో నిర్వహణ భారం అవుతోందని వారు ప్రభుత్వానికి విన్నవించారు. పాత ధరలతో కేంద్రాలను నడపడం కష్టతరంగా మారిందని వాపోయారు. వీరి అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం సుమారు 50 శాతం వరకు సేవా రుసుములను పెంచుతూ జీవో ఇచ్చింది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగ అభ్యర్థులపై అదనపు భారం పడనుంది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో కుల ఆదాయ నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఒకేసారి ఈ మూడింటి ధరలు రూ.80కి చేరడం వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఉన్నప్పుడు సర్టిఫికెట్ల కోసమే వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.
ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో ప్రారంభించిన మీసేవ కేంద్రాల్లో ఇలా చార్జీలు పెంచడం పట్ల సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సేవా రుసుములను నామమాత్రంగా పెంచాల్సింది పోయి ఒకేసారి 50 శాతం పెంచడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని ప్రజలు కోరుతున్నారు.
ALSO READ: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ పంచాయతీలు.. ఆ గ్రామాలు ఇవే, మంత్రి సీతక్క హర్షం