మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికల పర్వం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వేడిని రాజేస్తోంది. రేపు జరగనున్న అత్యంత కీలకమైన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ బలాన్ని కాపాడుకునేందుకు రిసార్ట్ పాలిటిక్స్ ను తెరపైకి తెచ్చాయి. మేడ్చల్ జిల్లా పరిధిలోని శామీర్పేట్ వద్ద ఉన్న లియోనియా రిసార్ట్ ఇప్పుడు రాజకీయ వ్యూహప్రతివ్యూహాలకు ప్రధాన కేంద్రంగా మారింది.
నలుమూలల నుంచి కౌన్సిలర్ల రాక
ఈ క్యాంప్ రాజకీయాలు అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, సిద్ధిపేట్ జిల్లాలకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లను ఇప్పటికే ప్రత్యేక వాహనాల్లో లియోనియా రిసార్ట్కు తరలించారు. ప్రత్యర్థి పార్టీలు తమ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు, అలాగే ఓటింగ్ సమయంలో ఎటువంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు ఈ ‘క్యాంప్’ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
రంగంలోకి దిగిన హేమాహేమీలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు ఈ క్యాంప్ను పర్యవేక్షిస్తుండటం విశేషం. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రిసార్ట్కు చేరుకున్నారు. వీరంతా కౌన్సిలర్లతో విడివిడిగా సమావేశమై, రేపు జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అధికార పక్షం తమ పట్టు నిలుపుకోవడానికి అవసరమైన సంఖ్యాబలంపై ఆరా తీయడమే కాకుండా, కౌన్సిలర్ల మధ్య ఎటువంటి అసమ్మతి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గెలుపే లక్ష్యంగా వ్యూహరచన..
చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ను అందుకోవడంలో పార్టీలు నిమగ్నమయ్యాయి. కౌన్సిలర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు, పార్టీ విప్ జారీ చేయడం వంటి సాంకేతిక అంశాలపై కూడా నేతలు చర్చించారు. మున్సిపల్ పీఠంపై తమ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్న మంత్రులు, సీనియర్ నేతలు నేరుగా రంగంలోకి దిగడంతో క్యాంప్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
రేపు ఉదయం కౌన్సిలర్లను నేరుగా రిసార్ట్ నుండి ఎన్నికల కేంద్రానికి తరలించే అవకాశం ఉంది. ఉత్కంఠ రేపుతున్న ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.