Sarpanch Election Results: తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలు నరాల తెగే ఉత్కంఠను రేపుతున్నాయి. పలు గ్రామాల్లో అభ్యర్థుల జాతకాలు చివరి నిమిషం వరకు దోబూచులాడాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో కొన్నిచోట్ల ఒక్క ఓటు అభ్యర్థి తలరాతను మార్చేయగా, మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రావడంతో ‘లక్’ (టాస్) విజేతను నిర్ణయించింది. జనగామ, కుమురం భీమ్ జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటనలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో సినిమా క్లైమాక్స్ను తలపించే సన్నివేశం చోటుచేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గంపల నర్సయ్య, స్వతంత్ర అభ్యర్థి గడ్డం జోజి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఇద్దరు అభ్యర్థులకు ఊహించని షాక్ తగిలింది. గ్రామంలో పోలైన మొత్తం 420 ఓట్లలో ఇద్దరికీ సరిసమానంగా చెరో 210 ఓట్లు వచ్చాయి. దీంతో ఫలితం ‘టై’ అయింది. విజేతను నిర్ణయించేందుకు ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం టాస్ వేశారు. ఈ టాస్లో అదృష్టం స్వతంత్ర అభ్యర్థి గడ్డం జోజిని వరించింది. దీంతో ఆయన సర్పంచ్గా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.
మరోవైపు, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలి గ్రామంలోనూ ఇదే తరహా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రతి రౌండ్లోనూ ఉద్వేగభరితంగా సాగింది. చివరకు సర్పంచ్ అభ్యర్థి రాథోడ్ పుష్పలత తన సమీప ప్రత్యర్థి దిలీప్ కాటేపై కేవలం ‘ఒక్క ఓటు’ తేడాతో విజయం సాధించారు. స్వల్ప తేడాతో గెలుపు వరించడంతో పుష్పలత వర్గీయులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకుని సంబరాలు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంత విలువైనదో ఈ రెండు ఘటనలు మరోసారి రుజువు చేశాయి.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు యువతకు సవాల్ విసురుతూ తమ సత్తా చాటారు. ప్రజాసేవకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ పెద్దపల్లి జిల్లాలో ఓ 82 ఏళ్ల వృద్ధురాలు ఘనవిజయం సాధించారు. మంథని మండలంలోని ఉప్పట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాశిపేట వెంకటమ్మ (82) సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. తన సమీప ప్రత్యర్థిపై వెంకటమ్మ ఏకంగా 500కు పైగా ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఎనిమిది పదుల వయసులోనూ ఆమె సాధించిన ఈ విజయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మరోవైపు, రాజకీయాలంటే యువతదే హవా అనుకుంటున్న తరుణంలో.. శత వసంతాలకు చేరువలో ఉన్న ఓ వృద్ధుడు ఎన్నికల బరిలో దిగి రికార్డు సృష్టించారు. నల్గొండ జిల్లా సంగ్రామ గ్రామంలో 95 ఏళ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డి సర్పంచ్గా గెలిచి రికార్డు సృష్టించారు. వందేళ్లకు చేరువలోనూ యువతతో పోటీపడి ఆయన సాధించిన విజయం అద్భుతం. ఊరి బాగు కోసం ఆయన చూపిన పోరాట స్ఫూర్తికి మెచ్చిన గ్రామస్తులు, భారీ మెజారిటీతో ఆయనకు పట్టం కట్టారు. ఈ వయసులో పోటీ చేయడమే గొప్పైతే.. గెలవడం మరో చరిత్రగా నిలిచింది.
Read Also: Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ‘తొలి’ షాక్.. ఇలా జరిగిందేంటీ?