BJP MP Laxman Comments On KCR(Telangana politics): తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెను రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు.
గులాబీ బాస్ కేసీఆర్ పై లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. నియంతలు నీడను కూడా నమ్మరని విమర్శించారు. కేసీఆర్ తన పాలనలో అదే ధోరణి ప్రదర్శించారని మండిపడ్డారు. రాజకీయ నేతలపై నిఘా పెట్టారని ఆరోపించారు. రాజకీయ నాయకులతోపాటు మీడియా పెద్దల ఫోన్లను ట్యాపింగ్ చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే .. బీఆర్ఎస్ పెద్దలు ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలను ధ్వంసం చేయించారని ఆరోపించారు. కంప్యూటర్ హార్డ్ డిస్కులు ధ్వంసం జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. కొన్ని ఫోన్లు ట్యాపింగ్ జరిగితే జరగవచ్చని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా లక్ష్మణ్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర హోంశాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్ ప్రధాన నిందితులని ఆరోపించారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ వ్వవహారం.. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నేనే బాధితుడిని!
కేసీఆర్ కుటుంబంపై లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత పాత్ర ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అక్రమాల్లో కల్వకుంట్ల ఫ్యామిలీదే ప్రధాన పాత్రని ఆరోపించారు. రాష్ట్ర సంపదను దోచుకున్న నిందితులకు శిక్ష పడాలన్నారు. ఇది ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రతి పథకంలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. తన పాలనలో ప్రజల స్వేచ్ఛను కేసీఆర్ హరించారని మండిపడ్డారు. ప్రశ్నించే వారిని వేధింపులకు గురిచేశారని తెలిపారు. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదని లక్ష్మణ్ విమర్శలు చేశారు. సచివాలయానికి వచ్చి పాలన సాగించలేదన్నారు. నియంతృత్వ ధోరణితోనే పాలన సాగించారని మండిపడ్డారు.