Janasena vs TDP: అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెద్దమదిన గ్రామంలో నిర్వహించిన ‘రచ్చబండ’ గ్రామ సభ ఒక్కసారిగా రణరంగంగా మారింది. ప్రభుత్వ భూముల్లోని అకేసియా మొక్కల నరికివేత విషయంలో అధికార కూటమికి చెందిన జనసేన , టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న అకేసియా చెట్లను తొలగించే విషయమై రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. జనసేన వర్గీయులు ఆ మొక్కలను నరికివేయాలని పట్టుబట్టగా.. టీడీపీ శ్రేణులు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రచ్చబండ సభలో ఈ విషయంపై చర్చ జరుగుతుండగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
అయితే.. ఈ గొడవకు కేవలం చెట్లు మాత్రమే కారణం కాదని ఆ భూముల్లో విలువైన రంగు రాళ్లు (Precious stones) లభ్యమవుతుండటమే అసలు కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ భూమిపై పట్టు సాధిస్తే రంగు రాళ్ల తవ్వకాల్లో లాభం పొందవచ్చనే ఉద్దేశంతోనే రెండు వర్గాలు పంతానికి పోయినట్లు సమాచారం.
మాట మాట పెరగడంతో సహనం కోల్పోయిన కార్యకర్తలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. రచ్చబండ వేదిక రక్తసిక్తంగా మారడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ALSO READ: తృటిలో తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు దిగిన కొద్దిసేటికే అగ్నికి ఆహుతైన ప్రైవేట్ బస్సు
టీడీపీ, జనసేన నేతల ఘర్షణ
విశాఖ-అనకాపల్లి పెదమదినలో తీవ్ర ఉద్రిక్తత
ప్రభుత్వ భూముల్లో అకేసియా మొక్కల నరికివేతపై వాగ్వాదం
మొక్కలు నరికివేయాలని జనసేన.. వద్దని అడ్డుకున్న టీడీపీ నేతలు
ఈ క్రమంలో పరస్పరం రాళ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు.. పలువురికి గాయాలు pic.twitter.com/IPMiOQ066s
— BIG TV Breaking News (@bigtvtelugu) January 20, 2026