తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావును ప్రత్యేక విచారణ బృందం సుదీర్ఘంగా విచారిస్తోంది. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ విచారణ గత నాలుగు గంటలుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సిట్ అధికారులు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం.
శ్రవణ్ రావుతో సంబంధాలపై ఆరా
ఈ విచారణలో ప్రధానంగా ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ ఎండి శ్రవణ్ రావు ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక, సర్వేల నిర్వహణ కోసం శ్రవణ్ రావు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రైవేట్ కార్యాలయాన్ని హరీష్ రావు ఏర్పాటు చేయించారనే ఆరోపణలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కార్యాలయం వేదికగా ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలు సాగాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ముఖ్యంగా హరీష్ రావు తన వాట్సాప్ నుండి కొన్ని ఫోన్ నంబర్లను శ్రవణ్ రావుకు పంపినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ నంబర్లను ట్యాపింగ్ చేయడం కోసమే పంపారా? అని ప్రశ్నించగా, హరీష్ రావు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్లు వార్తలు వస్తున్నాయి.
పోలీస్ అధికారులతో సంభాషణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావులతో హరీష్ రావు జరిపిన సంభాషణలపై సిట్ దృష్టి సారించింది. వీరితో హరీష్ రావు పలుమార్లు మాట్లాడినట్లు సాంకేతిక ఆధారాలను సేకరించిన అధికారులు, ఆ చర్చల సారాంశం ఏమిటని నిలదీస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల కదలికలను గమనించేందుకు వీరి సహాయం తీసుకున్నారా..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎలక్టోరల్ బాండ్లపై విచారణ
ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలోనూ సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నిస్తున్నారు. పార్టీ నిధుల సమీకరణ, బాండ్ల ద్వారా వచ్చిన భారీ మొత్తాల మూలాలపై ఆరా తీస్తున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి, ఈ నిధుల వినియోగానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
సాయంత్రం వరకు విచారణ సాగే అవకాశం
ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సిట్ అధికారులు అడిగే అనేక ప్రశ్నలకు హరీష్ రావు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. దీంతో సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత సిట్ అధికారులు మీడియాకు కీలక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
ALSO READ: Supreme Court: వివేకా హత్య కేసు.. ఇంకో పదేళ్లు దర్యాప్తు చేస్తారా?, సీబీఐపై సుప్రీం ఆగ్రహం