Sridhar Babu on BRS: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బిఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లక్ష్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బిఆర్ఎస్ అగ్రనేతలు ప్రతిరోజూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసరంగా విషం చిమ్ముతున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల కోసం మంచి పనులు చేస్తుంటే.. అది చూడలేక ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పదేళ్ల కాలంలో చేయలేని పనులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తుంటే ప్రతిపక్షం అడ్డు తగలడం సరికాదని ఆయన హితవు పలికారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే బిఆర్ఎస్ నాయకులకు ఎందుకు అంత ఆక్రోశమని మంత్రి ప్రశ్నించారు. సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. పేదల ఇళ్లలో వెలుగులు నింపుతుంటే ప్రతిపక్షాలు దానిపై విష ప్రచారం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తోందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇప్పటికే పలు గ్యారెంటీలను పట్టాలెక్కించామని.. మిగిలిన అంశాలను కూడా ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని వివరించారు. మాట తప్పని ప్రభుత్వం తమదని.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. పట్టణాల అభివృద్ధి మరింత వేగంగా జరగాలంటే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ అధికారం ఉండాలని.. అప్పుడే మరింత మెరుగైన సేవలందించగలమని చెప్పారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే వారికి బుద్ధి చెప్పి, అభివృద్ధిని కాంక్షించే కాంగ్రెస్కు అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read:ఎవరు ‘జాతిపితా’.. ఎవరు ‘బూతుపితా’ ప్రజలకు తెలుసు.. ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రతి రోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు: మంత్రి శ్రీధర్ బాబు
200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తే మీకేందుకు అక్రోషం
మేనిఫెస్టోలొ పెట్టిన ప్రతి అంశం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఆశీర్వదిస్తే ఇంకా మంచి… pic.twitter.com/WYkXTgX40T
— BIG TV Breaking News (@bigtvtelugu) February 5, 2026