Adi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బిఆర్ఎస్ నాయకులపై చేసిన విమర్శలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని, సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో ఆయన ఘాటు వ్యాఖ్యలతో ఎండగట్టారు.
తెలంగాణ అంటేనే బిఆర్ఎస్ అనే భ్రమను కల్పించి.. ప్రజల సెంటిమెంట్తో ఆ పార్టీ నాయకులు ఆడుకున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణను మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టుకుందని ఆరోపించారు. ప్రజలను నమ్మించి వారి గొంతులు కోసిన చరిత్ర గులాబీ పార్టీదని ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా బిఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెడుతుంటే.. కేటీఆర్ , హరీష్ రావులలో వణుకు మొదలైందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆడిన జాతిపిత డ్రామాలను ముఖ్యమంత్రి తనదైన శైలిలో పటాపంచలు చేశారని.. ఆ దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతోందని ఎద్దేవా చేశారు. నిజాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతోనే ఆ పార్టీ నాయకులు అసహనంతో ఊగిపోతున్నారని విమర్శించారు.
ముఖ్యంగా హరీష్ రావు తీరును ఆది శ్రీనివాస్ తీవ్రంగా తప్పుబట్టారు. మామ మెప్పు కోసం ముఖ్యమంత్రిపై నోరు పారేసుకోవడం సరికాదని హితవు పలికారు. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం తనకు తాను అవార్డు ఇచ్చుకున్నట్లుగా.. కేసీఆర్కు ‘జాతిపిత’ అనే బిరుదును వారే ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజలకు ఎవరు బూతుపితా.. ఎవరు జాతిపితా అనే విషయం స్పష్టంగా తెలుసని.. గతంలో కేసీఆర్ వాడిన భాషను ఒకసారి గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని.. అతిగా మాట్లాడితే సహించేది లేదని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.
Also Read: రాయలసీమకు ద్రోహం చేస్తే సహించేది లేదు.. శ్రీశైలం నీటి వాటాపై సమరం.. వైసీపీ మాజీ మంత్రులు ఫైర్!