KCR Visit: మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి ఇటీవల కన్నుమూయడం వరంగల్ జిల్లా రాజకీయాలోనే కాకుండా బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్లబెల్లిలోని పెద్ది స్వగృహానికి వచ్చి స్వయంగా పరామర్శించారు. గులాబీ దళపతి రాకతో నల్లబెల్లి ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగ వాతావరణం నెలకొంది.
దివంగత నేతకు ఘన నివాళులు
నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్రెడ్డి నివాసానికి చేరుకున్న కేసీఆర్, ముందుగా అక్కడే ఏర్పాటు చేసిన పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత పెద్ది కుటుంబ సభ్యులను కలుసుకొని, వారితో మాట్లాడారు. వారిని ఓదారుస్తూ, పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని, ఏ సమస్య వచ్చినా చూసుకునే బాధ్యత తనదని కేసీఆర్ కొండంత భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు.
రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం
పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల కోసం పెద్ది సుదర్శన్రెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ భవిష్యత్తు, సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.2.25 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో పెద్ది కుటుంబ సభ్యులకు పార్టీ నుండి గట్టి మద్దతు లభించినట్లయింది.
Also Read: బాబు హెచ్చరిక.. విజయ్ ఆదేశాలు.. ఇసుక దందాకు చెక్ పడేనా?
భారీగా తరలివచ్చిన శ్రేణులు
కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నల్లబెల్లి ప్రాంతానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. కేసీఆర్ ప్రయాణించిన దారి పొడవునా ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పెద్ది సుదర్శన్రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూనే, తమ అధినేత రాకతో కార్యకర్తలు వర్ధిల్లి, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లయింది. పెద్ది కుటుంబానికి కేసీఆర్ ఇచ్చిన భరోసాతో స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.