Simhavahini Mahankali temple miracles: భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల సందడితో పాతబస్తీ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యంగా నగర వీధులన్నీ భక్తి పారవశ్యంలో మునిగిపోగా, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు అత్యంత నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎటు చూసినా బోనాల కోలాహలం కనిపిస్తోంది. కేవలం స్థానికులే కాకుండా.. గతంలో ఇక్కడ నివసించి వేరే ప్రాంతాలకు వెళ్లిన భక్తులు సైతం ఈ పండగ సమయానికి ప్రత్యేకంగా వచ్చి అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేకత.
ఈ చారిత్రక ఆలయానికి ఎంతో ప్రత్యేకమైన విశిష్టత ఉంది. పాతబస్తీ ప్రాంతానికి ఈ శ్రీ సింహవాహిని అమ్మవారే గ్రామ దేవతగా విరాజిల్లుతున్నారు. మిగతా దేవాలయాలన్నింటికంటే.. ముందే వెలసిన తొలి దైవంగా ఈ అమ్మవారిని భక్తులు కొలుస్తారు. గతంలో నవాబుల పాలనా కాలంలో నగరంలోని ప్రతి దర్వాజాకు ఒక్కో అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. అయితే.. స్థానికంగా ఉన్న అన్ని దేవతల కంటే ముందుగా వెలసిన నల్ల పోచమ్మే ఈ సింహవాహిని అమ్మవారు.
ఈ ఆలయానికి సంబంధించిన మరో అద్భుతమైన సంఘటన భక్తుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో..సరిగ్గా చెప్పాలంటే 2024లో అమ్మవారే స్వయంగా పసుపు చల్లి తన దివ్య పాదాలను మోపినట్లుగా భక్తులు, నిర్వాహకులు చెబుతున్నారు. ఈ అద్భుత ఘటన స్థానికంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అమ్మవారి ప్రత్యక్ష ప్రసన్నత వల్లే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉందని భక్తులు నమ్ముతున్నారు.
Also Read: లాల్ దర్వాజా బోనాల వైభవం.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రులు
ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. అంతే కాకుండా అమ్మవారి కృపతో రాష్ట్రాన్ని అన్ని అరిష్టాల నుంచి కాపాడాలని భక్తులు వేడుకుంటున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి జాతర తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.