Cancer Cases: యాదాద్రి భువనగిరి జిల్లాలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు స్థానికులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి. గత మూడేళ్లలో జిల్లాలో 783 క్యాన్సర్ కేసులు నమోదవగా, 70 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, కొన్ని నిర్దిష్ట గ్రామాల్లోనే ఏటా పదుల సంఖ్యలో ప్రజలు క్యాన్సర్తో ప్రాణాలు కోల్పోతున్నారని… అవి అధికారిక రికార్డుల్లోకి ఎక్కడం లేదని సామాజిక వేత్తలు, ప్రజలు ఆరోపిస్తున్నారు.
క్యాన్సర్ కేసులపై విమర్శలు..
క్యాన్సర్ కేసులపై ఉన్న శ్రద్ధ ముందస్తు గుర్తింపులో కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉన్నప్పటికీ…గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్లు జరగకపోవడం పెద్ద శాపంగా మారింది. వ్యాధి ముదిరిన తర్వాత లక్షణాలు బయటపడటంతో… బాధితులు హైదరాబాద్ లాంటి నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. లక్షల రూపాయిలు అప్పులు చేసి ట్రీట్మెంట్ అందించినా, చివరకు ప్రాణాలు దక్కక కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా చితికిపోతున్నాయి.
ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..
గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం కూడా…పరిస్థితిని మరింత విషమింపజేస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం కాగితాలకే పరిమితమయ్యే గణాంకాలను పక్కన పెట్టి… క్యాన్సర్ ప్రభావిత ప్రాంతాలను ఇమ్మీడియెట్గా గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, విస్తృత స్థాయిలో ఉచిత స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తేనే ప్రాణనష్టాన్ని కంట్రోల్ చేయొచ్చని కోరుతున్నారు.
Also Read: ఆకాశంలో బిగ్ సర్ప్రైజ్.. ఫ్లైట్ నడిపిన బిజెపి ఎంపీ!