Telangana Rising Global Summit: ఇంకొన్ని రోజుల్లో ఇండియా మొత్తం తెలంగాణ వైపు చూసే రోజు రాబోతుంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ మెగా ఈవెంట్ జరగనుంది. ఇంటర్నేషనల్ రేంజ్లో ఈ సమ్మిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కమ్ జాయిన్ ది రైజ్ నినాదంతో అందరికి ఆహ్వానాలు పంపుతోంది. కేవలం పెట్టుడుల సదస్సుగానే కాకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా ఈ గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఈ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులతో పాటు రెండు దశాబ్ధాల తెలంగాణ ప్రస్థానాన్ని తెలియజేసేలా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో విజన్ డాక్యుమెంట్ ను కూడా ఆవిష్కరించనున్నారు. జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు తగ్గట్టుగా వికసిత్ భారత్ 2047 స్ఫూర్తితో రోడ్ మ్యాప్ రూపొందించారు. రాష్ట్రంలో ఆర్ధిక అభివృద్ధిని పరుగులు పెట్టించడం అన్నిరంగాల్లో సమానమైన ప్రగతి సాధించడం ప్రజలందరికి సంక్షేమ ఫలాలు అందించడమే ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను పబ్లిక్కు చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10 నుంచి 13 వరకు హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే ఈ సదస్సులో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని తెలిపింది. ప్రభుత్వ ప్రాజెక్టులు, నిపుణులతో సెషన్లు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడుంచింది. జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా అందించనుంది.
ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పెట్టుబడులు రాష్ట్రానికి ఎలా వస్తాయి? వాటివల్ల ఎలాంటి ఉపాధి అవకాశాలు కలుగుతాయి? టెక్నాలజీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న అంశాలపై ప్రజలకు ప్రత్యక్ష అవగాహన కలిగే అవకాశం ఈ సమ్మిట్ ద్వారా లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
Also Read: ఆదిలాబాద్కు సీఎం రేవంత్.. రూ.500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఇక ఈ నాలుగు రోజుల సమ్మిట్లో దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. వారి అనుభవాలు, అభిప్రాయాలు, పెట్టుబడి ప్రణాళికలు ప్రజలు ప్రత్యక్షంగా వినే అవకాశం పొందనున్నారు. యువతకు ఇది ఓ గొప్ప ప్రేరణగా మారనుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.