CM Revanth Reddy: రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని మొత్తం రూ.260.45 కోట్ల వ్యయంతో చేపట్టబోయే పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్రాభివృద్ధి కోసం రూ.18.70 కోట్ల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు, తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరచేలా ఈ నిధులను వినియోగించనున్నారు.
మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ స్థాపనకు రూ.1.75 కోట్ల పెట్టుబడితో శంకుస్థాపన చేయనుంది.
అదేవిధంగా రూ.19.69 కోట్ల వ్యయంతో 160 స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా చిన్న వ్యాపారాలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, కుటీర పరిశ్రమలు వృద్ధి చెందనున్నాయి. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పట్టణంలో విద్యా రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (YIIRS) కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నిరుపేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది. నివాస వసతులు, ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలు కలిగి ఉండే ఈ క్యాంపస్ భవిష్యత్తు తరాలకు అభివృద్ధి వేదిక కానుంది.
అదేక్రమంలో మహాలక్ష్మి వాడ, విద్యానగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ఆధునికీకరణ కోసం రూ.2 కోట్లతో పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా విద్యార్థులకు సరైన తరగతి గదులు, మెరుగైన మౌలిక సదుపాయాలు అందనున్నాయి.
పట్టణ భద్రత, శాంతి–భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ ప్రాంతంలో రూ.11.93 కోట్లతో 18 పోలీస్ క్వార్టర్స్, రూ.2.6 కోట్లతో 3 ఇంటెలిజెన్స్ విభాగ క్వార్టర్స్, అలాగే రూ.2 కోట్లతో భరోసా కేంద్రం ప్రారంభానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
స్థిరమైన విద్యుత్ సరఫరా అభివృద్ధికి మూలాధారం కావడంతో, కొత్త కలెక్టరేట్ సమీపంలో TGNPDCL ఆధ్వర్యంలో రూ.231.24 లక్షల నిధులతో 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీనితో ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా అందనుంది.
Also Read: ఊరోళ్ళకి బంపర్ ఆఫర్.. నా భార్యను గెలిపిస్తే హెయిర్ కటింగ్,షేవింగ్ ఫ్రీ..
సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. భద్రతా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా సమావేశాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా ఆదిలాబాద్ పట్టణం విద్య, ఉపాధి, భద్రత, మౌలిక వసతుల పరంగా కొత్త దశలోకి అడుగుపెట్టనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.