Telangana RTC JAC: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు శుక్రవారం అత్యవసరంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి, ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో చర్చల విషయమై చర్చించనున్నారు.
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసర సమావేశం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గురువారం రేవంత్రెడ్డి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కలిసి సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో మంత్రలు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్న ప్రభాకర్, జూపల్లితో కమిటీ ఏర్పాటైంది. శుక్రవారం ఆర్టీసీ కార్మికులతో సబ్ కమిటీ చర్చలు జరపనుంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం కానున్నారు. రాత్రి డ్రైవర్ శంకర్గౌడ్ మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు హాజరుకావాలని కొందరు నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్నిరోజులుగా ప్రభుత్వం చర్చలకు పిలుస్తోంది.
శంకర్గౌడ్ మృతి.. చర్చలకు సబ్ కమిటీ పిలుపుపై చర్చ
హామీ లేకుండా వెనక్కి తగ్గకూడదని జేఏసీ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రుల కమిటీతో సమావేశం కావాలా? వద్దా? అన్నదానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు ఆర్టీసీ నేతలు. మరోవైపు టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పష్టంచేశారు.
డిమాండ్ల సాధన కోసం ఆందోళన చెందుతున్న ఉద్యోగులు ఎవరూ అధైర్య పడొద్దన్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకునేలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాలు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించిందన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరం అవుతాయని వెల్లడించారు.
ALSO READ: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్
ఉద్యోగుల సంక్షేమం యాజమాన్యం ప్రధాన ధ్యేయమన్నారు ఎండీ నాగిరెడ్డి. సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రక్రియపై పూర్తి నమ్మకంతో ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉద్యోగ సంఘాలతో కీలక భేటీ జరుగుతుందన్నారు. ఈ భేటీలో పెండింగ్ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్నారు. కార్మికులు సంయమనం పాటించాలని, చర్చల ఫలితాలు ఉద్యోగులకు మేలు చేకూరుస్తాయని అన్నారు. ఎలాంటి ఆందోళనలకు ఉద్యోగులు లోనుకాకుండా శాంతియుతంగా ఉండాలని టీజీఎస్ ఆర్టీసీ నాగిరెడ్డి కోరారు.