Jagga Reddy: అప్పటి వరకు బాగానే ఉన్న నాలుగు నెలల పసికందు ఒక్కసారిగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది. అత్తామామ ఆరోగ్యం బాగాలేక మంచానికే పరిమితమయ్యారు. డ్రైవరుగా పనిచేసే భర్తకు ఫోన్ చేస్తే అటు నుంచి స్పందన లేదు. దీంతో రాపిడోలో ఆటో బుక్ చేసుకొని, అర్ధరాత్రి వేళ సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఏ వార్డుకు వెళ్లాలో తెలియదు. ఆస్పత్రి ప్రాంగణంలో గేటు వద్ద ఉన్న మహిళల వార్డులోకి వచ్చి చంటిబిడ్డను ఎత్తుకొని నిల్చుంది. ఇంతలోనే ఆకస్మిక సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీకి వచ్చారు జగ్గారెడ్డి. మహిళా వార్డును పరిశీలిస్తూ డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడుతున్నారు. నాలుగు నెలల పసికందుతో తీవ్ర వేదనతో నిల్చొని ఉన్న ప్రవళికను చూసి ఏమైందమ్మా అంటూ అడిగారు జగ్గారెడ్డి. తన బిడ్డ చాలా సేపటి నుంచి ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయిందని, అందుకే తానొక్కదాన్నే ఇలా రాత్రి పూట ఆస్పత్రికి వచ్చానని ఆమె చెప్పింది.
నాలుగు నెలల చంటి బిడ్డను ఏమైందో తెలియక, ఏవార్డుకు వెళ్లాలో అర్థంకాక గోసపడుతున్న ప్రవళికకు జగ్గారెడ్డి అండగా నిలిచారు. ఆమె బాధను అర్థం చేసుకొని, మహిళల వార్డు నుంచి ఎంసీహెచ్ వరకు తన కారులో తల్లీ బిడ్డను తీసుకెళ్లారు. రెండో అంతస్తులో ఉన్న పసిపిల్లల వార్డు వరకు వెళ్లారు. ప్రవళిక పరిస్థితిని, నాలుగు నెలల బిడ్డ ఆరోగ్యం బాగాలేని విషయాన్ని డాక్టర్లకు వివరించారు జగ్గారెడ్డి. వెంటనే చికిత్స మొదలుపెట్టాలని సూచించారు.
Also Read: తెలంగాణ ఆర్థిక శాఖ సంచలన నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి ఆ రూల్ బంద్!
అర్దరాత్రి సమయంలో చంటిబిడ్డకు చికిత్స ఇప్పించేందుకు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ప్రవళికకు ఊరట లభించింది. డాక్టర్లు వెంటనే అప్రమత్తమైన చికిత్స ప్రారంభించారు. వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పాపకు ఫిట్స్ వచ్చినట్లు గుర్తించారు. అవసరమైన వైద్యసేవలు అందించారు. డ్రైవింగ్ కోసం వెళ్లిన ప్రవళిక భర్తతోనూ జగ్గారెడ్డి ఫోన్లో మాట్లాడారు. బిడ్డకు చికిత్స మొదలైందని, వెంటనే ఆస్పత్రికి రావాలని అతడికి సూచించారు. నాలుగు నెలల పసిబిడ్డ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడంతో అర్ధరాత్రి వేళ పరుగు పరుగున ఆస్పత్రికి వచ్చిన ప్రవళికకు అక్కడే ఉన్న జగ్గారెడ్డి ధైర్యం నింపడం విశేషం.
Also Read: 100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్పై అంబటి ఫైర్!