JAC Protest: శంషాబాద్ మున్సిపాలిటీలో జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ), విద్యార్థి సంఘాల నేతలు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. శంషాబాద్ డివిజన్ను చార్మినార్ జోన్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శంషాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు.
‘శంషాబాద్ బచావో – చార్మినార్ హటావో’ నినాదంతో చేపట్టిన ఈ ర్యాలీలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శంషాబాద్ అభివృద్ధికి ఈ నిర్ణయం తీవ్రంగా నష్టం కలిగిస్తుందని నేతలు పేర్కొన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలు, ఐటీ హబ్లతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని.. దీనిని ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.
ర్యాలీ అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ప్రకటించాలని స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
శంషాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
AlSO READ: Diamond Jubilee celebrations: గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో అక్కినేని నాగార్జున సందడి