Telangana New Rules: తెలంగాణలో వాహనదారులకు కీలక అలర్ట్. వాహనదారులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. తెలంగాణతోపాటు హైదరాబాద్లో తిరిగే ప్రతి వాహన యజమాని ప్రస్తుత వినియోగిస్తున్న మొబైల్, ఈ-మెయిల్ చిరునామాలను తక్షణమే అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. వాహన్ పోర్టల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి నెల రోజుల గడువు విధించింది. గడువులోగా వివరాలు నమోదు చేసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.
తెలంగాణలో వాహనదారులకు బిగ్ అలర్ట్
ట్రాఫిక్ చలాన్ల జారీ విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు చలాన్లను ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చేసింది. ఈ విధానం ద్వారా పంపే ట్రాఫిక్ చలాన్ల నోటీసులకు చట్టబద్ధత కల్పించింది.
వాహనదారులకు వేగంగా, కచ్చితంగా సమాచారం చేరుతుందని భావిస్తోంది. ఈ కొత్త రూల్స్ జూన్ ఒకటి సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే సమయంలో వాహనదారులు తమ వివరాలను వాహన పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలని సూచన చేసింది. అందుకు 30 రోజుల పాటు గడువు ఇచ్చింది.
జూన్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. లింకు చేసుకోకుంటే చిక్కులు తప్పవు
గడువు ముగిసిన తర్వాత డిజిటల్ రూపంలో వాహనదారుల ఫోన్లకు, మెయిల్ ఐడీలకు చలాన్లు జారీ చేయనుంది. నెల గడువు ముగిసిన తర్వాత వాహన యజమాని మొబైల్, ఈ-మెయిల్, వాట్సాప్కు ఏవైనా చలాన్ వెళ్తే వారికి అధికారికంగా అందినట్లే పరిగణిస్తారు. ఈ విషయంలో వాహనదారులు తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఆ చలాన్ వివరాలు ఆన్లైన్ పోర్టల్లో రికార్డవుతాయి కూడా.
కొత్త పద్ధతిలో చలాన్ల గురించి ప్రధాన కారణాలను అధికారులు వివరించారు. పాత ఫోన్ నంబర్లు, వాడుకలో లేని చిరునామాలు డేటాబేస్లో ఉండటం వల్ల నోటీసులు వాహనదారులకు చేరలేదన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో చనాన్లు ప్రజలు చెల్లించకుండా పెండింగ్లో ఉన్నట్లు గుర్తించినట్టు వివరించారు.
ALSO READ: రేవంత్ రెడ్డి టార్గెట్గా డీకే అరుణ ఫైర్.. సోనియా గాంధీ క్రెడిట్పై సంచలన వ్యాఖ్యలు!
నోటీసులు పంపే విధానంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమ చేతికి చలాన్ అందలేదని వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు-రవాణా శాఖ అధికారులతో వాదనలకు దిగిన సందర్భాలను గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చామని, దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
వాహన్ పోర్టల్ డేటాబేస్లో వివరాల ఆధారంగా చనాన్లు పంపితే వేగంగా ఫలితాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి చర్యతో ట్రాఫిక్ నిబంధనల అమలు ప్రక్రియ మరింత సులభం కానుంది. పేరుకుపోయిన పెండింగ్ బకాయిలను రికవరీ చేయడానికి ఈ విధానం అనుకూలిస్తుందని తెలిపారు.