DK Aruna: స్వేచ్ఛ బ్యూరో: అమరవీరుల ఆత్మ బలిదానం, ప్రజలంతా కొట్లాడితే తెలంగాణ వచ్చిందని, అయితే.. గతిలేని పరిస్తితుల్లో.. కాంగ్రెస్.. ఓటమి భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చింది తప్పితే.. ప్రజలపై ప్రేమతో కాదని పాలమూరు ఎంపీ డీకే అరుణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఏర్పాటై.. పుష్కర కాలం గడిచినా నీళ్ళు, నిధులు, నియామకాల నినాదం నెరవేరలేదన్నారు. అమరవీరుల కుటుంబాలను నిలువునా మోసం చేశారని ఆమె ధ్వజమెత్తారు.
వెనక్కి తిరిగి చూస్తే.. కుంగిన ప్రాజెక్టులు, ప్రజలపై ఆర్థిక భారం, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తప్ప ఏం లేదన్నారు. పన్నెండేళ్లలో తెలంగాణ ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని, పాలకుల అసమర్థత వల్లే నీటిపారుదల ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పేరుగాంచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది వీరులు ప్రాణ త్యాగాలు చేస్తే.. సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.. సోనియా గాంధీకి క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని దుయ్యబట్టారు.
ఆత్మ బలిదానాలు చేసుకుని నింగికి ఎగసిన తారల ఆకాంక్ష ఇప్పటికీ సాకారం కాలేదని, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హమీ అమలు చేయకుండా, నిలువునా మోసం చేశారన్నారు. అమరుల కుటుంబాలకు, ఉద్యమకారలకు గౌరవ భృతి, 250 గజాల ఇంటి స్థలం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం బాగుపడింది ఎవరనేది ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజల పై భారం మోపి పరిపాలన చేసే దుస్థితి రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. దోచుకునుడు, దాచుకునుడు తప్ప పదేళ్లలో చేసిందేమీ లేదన్నారు. ఈ రెండేళ్లలో కుర్చీని కాపాడుకునే ప్రయత్నం తప్ప.. రాష్ట్ర ప్రగతిపై శ్రద్ధ చూపలేదని దుయ్యబట్టారు. ఆదాయం సృష్టిస్తాం పేదలకు పంచుతామన్నారని, కాంగ్రెస్.. సృష్టించిన ఆస్తుల విలువ ఎంత..? చేసిన అప్పులు ఎంత చెప్పాలని డీకే అరుణ ప్రశ్నించారు.
Also Read: ప్రాంతంవాడు మోసం చేస్తే పాతరేయాలి.. కేసీఆర్పై రవీంద్ర నాయక్ ఫైర్!