గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్పటివరకు ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వానలు పెద్ద ఉపశమనం కలిగించాయి. ఉక్కపోత తగ్గి వాతావరణం చల్లబడటంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. సామాన్య ప్రజలకు సంతోషాన్నిచ్చిన ఈ వాతావరణ మార్పు అన్నదాతలకు కన్నీటిని మిగులుస్తోంది. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.
2 గంటల్లో భారీ వర్షం
ఈ అకాల వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. పొలాల్లో ఉన్న పంటను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచిస్తున్నారు. మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం వేగంగా మారిపోతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం మొదలైంది. రాబోయే రెండు గంటల్లో భాగ్యనగరంలోని పలు ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఈ జిల్లాల్లో భారీ వాన
హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు, మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
నిన్న సాయంత్రం హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. మియాపూర్, కూకట్పల్లి, బోరబండ, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ ఏరియాల్లో వాన దంచికొట్టింది. ఒక్కసారిగా పడిన రాళ్ల వానకు నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆకస్మిక వర్షం కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ALSO READ: Rythu Bharosa: పీఎం కిసాన్ దారిలో రైతు భరోసా.. నిధుల జమ మార్పుపై క్లారిటీ ఇవ్వని సర్కార్!