PSARA License: స్వేచ్చ బ్యూరో: పీఎస్ఏఆర్ఏ లైసెన్స్ లేకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ హెచ్చరించారు. ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో బుధవారం వివిధ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల ఓనర్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ఏ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ‘ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ (రెగ్యులేషన్) యాక్ట్ (PSARA)-2005, తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రకారం ప్రతి ఏజెన్సీకి లైసెన్స్ తప్పనిసరని చెప్పారు.
గతంలో కొందరు సరైన లైసెన్స్ లేకుండానే గార్డులను, సూపర్వైజర్లను నియమించినట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించిందన్నారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల కాలంలో కొందరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు నేరాల్లో పాల్గొన్న సంఘటనలు వెలుగు చూడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీల యజమానులు తాము నియమించుకునే ప్రతి ఒక్క ఉద్యోగి పూర్వాపరాలు, నేర చరిత్రను పోలీస్ వెరిఫికేషన్ ద్వారా నిర్ధారించుకోవాలన్నారు. 21 రోజుల బేసిక్ ట్రైనింగ్ తర్వాతే వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు.
Also read: భారీ సైబర్ మోసం.. మాజీ పీఎం కుమారుడి ఖాతా నుంచి కోట్లు కొట్టేశారు, రికవరీలో అధికారులు
సెక్యూరిటీ గార్డుల శ్రమను దోపిడీ చేయవద్దన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతన చట్టాలు, ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలను ఖచ్చితంగా కల్పించాలని సూచించారు. ఈ నిబంధనల అమలును కార్మిక శాఖ నిరంతరం పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీసులకు కళ్లు, చెవులుగా వ్యవహరించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.
సమావేశంలో పాల్గొన్న సెక్యూరిటీ ఏజెన్సీల ఓనర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు తమ లైసెన్సింగ్ ప్రక్రియలు, లైసెన్స్ పునరుద్ధరణ, ఆన్లైన్ పోర్టల్ , కార్మిక నిబంధనలు, జీతాలకు సంబంధించిన పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై సానుకూలంగా స్పందించిన విజయ్ కుమార్ పరిపాలనా పరమైన సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం నడుచుకునే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు పోలీస్, ఇంటెలిజెన్స్, కార్మిక శాఖల తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఓఎస్డీ కమలాసన్ రెడ్డి, కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్, అడ్మిన్ ఎస్పీ చక్రవర్తి పాల్గొన్నారు. కార్మిక శాఖ తరఫున అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సుమతి గోపాల్ దాస్ ప్రత్యేకంగా హాజరయ్యారు.
Also read: ఒక్క ఛాన్సిచ్చి చూడండి.. మార్పు తెచ్చి చూపిస్తా! రేవంత్ మార్క్ మార్పైతే కాదట!