తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా రిపోర్ట్ ప్రకారం నేడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మరో రెండు గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం..
వాతావరణ శాఖ అధికారుల సూచన ప్రకారం ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయి. మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో సైతం వాతావరణం మేఘావృతమై ఉంటుంది. సిరిసిల్ల సహా మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే వీలుంది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా హైదరాబాద్ నగరంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో మరో మూడు గంటల వరకు వాతావరణం పొడిగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొట్టాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా చందంపేటలో 70 మి.మీ వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొదలుకొని వికారాబాద్, సిద్దిపేట వరకు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు కురిశాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగులు పడ్డాయి. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణం మధ్య భారీ జల్లులు పడ్డాయి.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిన్న సాయంత్రం వాతావరణం చల్లబడింది. దక్షిణ హైదరాబాద్ పరిధిలో వానలు బీభత్సం సృష్టించాయి. నగరంలో అత్యధికంగా బహదూర్ పురా ప్రాంతంలో 42.8 మి.మీ వర్షపాతం రికార్డైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టారు. నగర ప్రజలు ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రానున్న కొన్ని గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.