Jupally Krishna Rao: విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో అమరురాలైన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సౌమ్య సోదరుడు జి. శ్రవణ్కు ఎక్సైజ్ శాఖలోనే జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ నియామక పత్రం అందజేశామని తెలిపారు. ఈ నియామకం ద్వారా ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా, బాధిత కుటుంబానికి శాశ్వత భరోసా కల్పించిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గతంలోనే సౌమ్య కుటుంబాన్ని పరామర్శించి రూ. కోటి ఎక్స్గ్రేషియా అందజేశారని, ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి స్థిరమైన భద్రత కల్పించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఆ ఆదేశాల అమలులో భాగంగానే నేడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ద్వారా శ్రవణ్కు ఉద్యోగ నియామక పత్రం అందజేశామని చెప్పారు.
సౌమ్య పదవీ విరమణ పొందే వయస్సు వరకు రావాల్సిన పూర్తి జీతభత్యాలను కూడా ఆ కుటుంబానికి చెల్లించాలనే మానవీయ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. నిజామాబాద్లో గంజాయి స్మగ్లర్ల వాహనాన్ని అడ్డుకునే క్రమంలో సౌమ్య చూపిన సాహసం వెలకట్టలేనిదని మంత్రి పేర్కొన్నారు. నిందితులు కారుతో ఢీకొట్టి ఆమె ప్రాణాలను బలిగొన్న తీరు అత్యంత పాశవికమని ఆవేదన వ్యక్తం చేశారు. కర్తవ్య నిర్వహణలో సౌమ్య చేసిన త్యాగం ఎక్సైజ్ శాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్న మంత్రి, నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Asifabad Municipality: చిక్కినట్టే చిక్కి చేజారిపోయిన మున్సిపల్ పీఠం.. బలం ఉన్నా.. ఫలితం సున్నా..!