తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానలు పడుతున్నాయి. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షాలు ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ అన్నదాతలకు మాత్రం కన్నీరు మిగిలిస్తున్నాయి.
అన్నదాతల ఆవేదన..
పంట చేతికి వచ్చే కీలక సమయంలో ఈ వర్షాలు పడటం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీటి పాలు కావడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతుండటంతో భారీ నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఆకాశం మేఘావృతం కావడం చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు..
రాబోయే రెండు, మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏపీలోనూ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వాతావరణ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీ వర్షం కురిసింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో పొలాల్లో పని చేసేవారు చెట్ల కింద ఉండవద్దని సూచనలు జారీ చేశారు. పల్లపు ప్రాంతాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఉరుములు మెరుపుల ధాటికి ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.
ఈ అకాల వర్షాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.
ALSO READ: Rythu Bharosa: రైతు భరోసా అప్లికేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. త్వరగా ఇలా అప్లై చేసుకోండి.!