Jupally Krishna Rao: స్వేచ్ఛ, బ్యూరో : నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగండ్ల క్షేత్రం శనివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, దేవస్థాన అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మంత్రి జూపల్లి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఈ నెల 26 నుంచి జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికను (పోస్టర్) ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న వివిధ మౌలిక సదుపాయాల కల్పన పనులకు మంత్రి భూమిపూజ చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తున్నామని, సిర్సనగండ్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి కొల్లాపూర్ పట్టణంలో రంజాన్ సందర్భంగా ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనలకు హాజరై ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో… అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
Also Read: Green grapes vs Black grapes: ఆకుపచ్చ ద్రాక్ష Vs నల్లటి ద్రాక్ష.. ఏవి ఆరోగ్యానికి బెస్ట్ ?