తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు వరుణుడు కాస్త ఊరటనిచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులో భారీ వడగండ్ల వాన కురిసింది. మండుతున్న ఎండలతో ఇబ్బంది పడుతున్న పర్యాటకులు ఈ అకాల వర్షంతో పులకించిపోయారు. ప్రకృతి ఒడిలో చల్లటి గాలులు వీస్తుండటంతో పర్యాటక ప్రాంతమంతా ఆహ్లాదకరంగా మారింది. అరకు లోయలో కురిసిన ఈ అద్భుత వర్షం పర్యాటకులకు మరుపురాని అనుభూతిని మిగిల్చింది.
మరోవైపు తెలంగాణలోనూ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న కొద్ది గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతాల్లో ఎప్పుడైనా వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ రోజు సాయంత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండల పరిధిలో గల మిన్ పూర్, లింగాయిపల్లి, పొడిచెన్ పల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్, పుల్కల్, జోగిపేట, జిన్నారం, మొగడంపల్లి మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోనూ వడగండ్ల వాన కురియడంతో రోడ్లన్నీ తెల్లటి మంచు పరచినట్లుగా దర్శనమిచ్చాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం వల్ల వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు.
రెండు గంటల్లో భారీ వర్షం..
తెలంగాణలోని దక్షిణ జిల్లాలకు సైతం పిడుగుల హెచ్చరిక జారీ అయింది. రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలోని వట్ పల్లి, పుల్కల్ ప్రాంతాల్లో మేఘాల గర్జన ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పరిసరాల్లో రాబోయే గంటలో భారీ వర్షం పడనుంది.
హైదరాబాద్ నగరంలోనూ అక్కడక్కడ చెదురుమదురు చినుకులు పడే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రెండు గంటల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి తేలికపాటి వర్షం కురవవచ్చు. జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని తాజా బులిటెన్ పేర్కొంది. ఈ అకాల వర్షాలు వేసవి వేడిని తగ్గించినప్పటికీ రైతాంగం మాత్రం తమ పంటల విషయంలో కొంత ఆందోళన చెందుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఇలా వడగళ్లు కురవడం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ALSO READ: Khammam News: ఖమ్మంలో విషాదం.. ఫోటో దిగుతూనే ప్రాణాలు వదిలిన మహిళ !