Khammam News: ఖమ్మం నగరంలో జరిగిన ఒక విషాద ఘటన మనిషి జీవితం ఎంతటి క్షణభంగురమో కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. బంధువుల ఇంటి శుభకార్యానికి వెళ్ళిన ఒక యువ ఉపాధ్యాయురాలు, అందరితో నవ్వుతూ గడుపుతూనే మృత్యుఒడికి చేరుకోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఖమ్మం నగరంలోని రామదాస్ నగర్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుష్మిత, తన బంధువుల ఇంటి గృహ ప్రవేశ వేడుకకు హాజరయ్యారు. వేడుకలో భాగంగా వేదికపై తన స్నేహితురాలి భుజంపై చేయి వేసి ఫోటో దిగుతుండగా.. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా ఉన్న సుష్మిత ఒక్కసారిగా కళ్ళు తేలేసి కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె మరణానికి కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest) కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
సుష్మిత గత రెండేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నప్పటికీ, భర్తతో కలిసి ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ తనదైన ముద్ర వేసుకున్న ఆమె, ఇలా అకస్మాత్తుగా మరణించడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె చనిపోయే కొద్ది క్షణాల ముందు వరకు నవ్వుతూ ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై వైద్య నిపుణులు మరియు స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ అనంతర పరిస్థితుల్లో (Post-Covid), వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుండి యువత వరకు ఇలా అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తీవ్రమైన ఒత్తిడి, మారిన జీవనశైలి, అధిక రక్తపోటు (High BP), లేదా గుర్తించని గుండె సంబంధిత సమస్యలు ఇటువంటి ఆకస్మిక మరణాలకు దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 40 ఏళ్లలోపు వారైనా సరే, శరీరంలో ఏదైనా అసౌకర్యం కలిగినా, గుండెల్లో చిన్నపాటి నొప్పి లేదా నలతగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం. ఒక్క క్షణంలో మనిషి ప్రాణం ఎలా గాల్లో కలిసిపోతుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. సుష్మిత మరణం ఆ కుటుంబానికి తీరని లోటుగా మిగిలిపోయింది.
Read Also: Falaknuma Fire: ఫలక్నుమా ఫర్నీచర్ షాప్లో భారీ అగ్నిప్రమాదం.. కోట్ల ఆస్తి బుగ్గి