తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఊరటనిచ్చాడు. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోతతో సతమతమవుతున్న జనాలకు ఈ ఆకస్మిక వర్షం ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి.
నగరంలోని ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ వంటి చోట్ల భారీ వర్షం కురుస్తోంది. చందానగర్, పటాన్ చెరు, కొండాపూర్, కుత్బుల్లాపూర్, లింగంపల్లి పరిసరాల్లోనూ వాన పడుతోంది. ఐటీ కారిడార్లో కురుస్తున్న ఈ వర్షం కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
ముఖ్యంగా సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో ట్రాఫిక్ సమస్య జటిలమైంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. అటు వర్షం.. ఇటు ట్రాఫిక్ జామ్తో భాగ్యనగర రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నందున విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడకూడదని స్పష్టం చేసింది. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.