TG EAPCET 2026: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్ సెట్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,01,194 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఎప్ సెట్ కన్వీనర్ కె. విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. మే 4వ తేదీ నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఈ నెల 23 ఉదయం 11 గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులు ఏప్రిల్ 27 మధ్యాహ్నం 3 గంటల నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని కన్వీనర్ తెలిపారు.
ఈసారి ఇంజినీరింగ్ కోసం 2,10,308 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోసం 90,569 మంది అప్లై చేసుకున్నారు. రెండు స్ట్రీమ్లకు కలిపి మరో 317 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎప్ సెట్ కోసం మొత్తం 16 టెస్ట్ జోన్లలో 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్లోని నాలుగు జోన్లలో కలిపి 59 కేంద్రాలు ఉండగా, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి పట్టణాల్లోనూ ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ సేకరించాల్సి ఉన్నందున, విద్యార్థులు చేతులకు మెహిందీ, టాటూలు, ఇంక్ వంటివి పెట్టుకోవద్దని ఎప్ సెట్ కన్వీనర్ విజయకుమార్ రెడ్డి సూచించారు.
Also read: బీజేపీలోకి జీవన్ రెడ్డి? ఓ కేంద్ర మంత్రితో రహస్య మంతనాలు? అసలు నిజాలివే..
హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. కాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, వాచీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా హాల్లోకి అనుమతించబోమని వెల్లడించారు. కాగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ కు మే 4, 5 తేదీల్లో, ఇంజినీరింగ్ స్ర్టీమ్ కు మే 9 నుంచి 11వరకూ పరీక్షలు కొనసాగుతాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. అయితే, పరీక్ష ప్రారంభానికి కనీసం గంటన్నర ముందే సెంటర్కు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు.
Also read: దాహార్తిపై ఎంపీల దండయాత్ర.. ఖమ్మం టు భద్రాద్రి యుద్ధ ప్రాతిపదికన బోర్ల వేట!