Sankranti Special Buses: సంక్రాంతి అంటేనే పిండివంటలు, పందెం కోళ్లు, సొంతూరి జ్ఞాపకాలు. పండక్కి పల్లెకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ల రేట్లు చూస్తే జేబులకు చిల్లులు పడటం ఖాయం. ఈసారి ఆ టెన్షన్ మీకు వద్దు. ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) భారీ స్కెచ్ వేసింది. హైదరాబాద్ నుంచి ఏకంగా 6 వేలకు పైగా బస్సులను రంగంలోకి దించింది. మరి ఛార్జీలు పెరుగుతాయా? మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందా? పూర్తి వివరాలు మీకోసం..
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని తట్టుకునేందుకు ఈ ఏడాది మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన అధికారులు, ఆయా తేదీల్లో అదనపు బస్సులను అందుబాటులో ఉంచారు. అలాగే, పండుగ ముగించుకుని తిరిగి వచ్చే వారి కోసం జనవరి 18, 19 తేదీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, కేపీహెచ్బీ, గచ్చిబౌలి పాయింట్ల నుంచి బస్సులు నడపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అక్కడ షామియానాలు, తాగునీరు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు.
పండుగ సమయాల్లో ఒక వైపు రద్దీ ఉండి, తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుంది. దీనివల్ల అయ్యే డీజిల్, నిర్వహణ ఖర్చుల భర్తీ కోసం.. 2003 నాటి జీవో నెంబర్ 16 ప్రకారం కేవలం ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 50% అదనపు (1.5 రెట్లు) ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. రెగ్యులర్ సర్వీసుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ సవరించిన ఛార్జీలు జనవరి 9, 10, 12, 13, 18, 19 తేదీల్లో మాత్రమే వర్తిస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని యాజమాన్యం వెల్లడించింది. ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. మరిన్ని వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించవచ్చు.
Read Also: నమ్మకానికి ‘కన్నం’.. చనిపోయిన వ్యక్తి బంగారం కాజేసిన మాజీ బ్యాంక్ మేనేజర్!