హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) భారీ ఊరటనిచ్చింది. నగర పరిధిలో తిరిగే మెట్రో ఏసీ, డీలక్స్ బస్సు చార్జీలలో ఏకంగా 30 శాతం భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల కాలంలో పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందనే వార్తల నడుమ ఇంధన నింపే కేంద్రాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. గంటల తరబడి జనం వాహనాలతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఉండటంతో పాటు ప్రయాణాలు సాఫీగా సాగేందుకు ఆర్టీసీ ఈ ఆఫర్ను తెరపైకి తెచ్చింది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత వాహనాలను రోడ్లపైకి తీసి ఇబ్బందులు పడే బదులు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఇంధన కొరత వస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పెట్రోల్ కొరత లేదని కేవలం అనవసర రద్దీ మాత్రమే పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. పెట్రోల్ కష్టాలు పడుతూ రోడ్ల మీద ఇబ్బంది పడటం ఎందుకని ప్రశ్నించారు. మన ప్రయాణ అవసరాలకు ఆర్టీసీ బస్సులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని గుర్తు చేశారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు.
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆర్టీసీ సంస్థ పేర్కొంది. వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. గాలి కాలుష్యం స్థాయి కూడా గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశంలో ఇంధన పొదుపునకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయవచ్చు. వీటన్నింటికీ మించి సామాన్యుల జేబులకు చిల్లు పడకుండా డబ్బులు ఆదా అవుతాయి. అందుకే సేఫ్ సేవింగ్ స్మార్ట్ ట్రావెల్ విధానాన్ని ప్రజలు అలవాటు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలు ఈ ఆఫర్ను అందిపుచ్చుకుని తక్కువ ఖర్చుతో ఏసీ బస్సుల్లో హాయిగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
ALSO READ: Harish Rao: సిద్దిపేటలో తనపై పోటీ చేయాలంటూ రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్